చాట్రాయి మండలానికి మంచి పేరు తెస్తా…
ఏపి కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేశి రెడ్డి రాఘవరెడ్డి
విశాలాంధ్ర`చాట్రాయి : ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఐకమత్యంగా పనిచేయాలని ఎ పి కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేశి రెడ్డి రాఘవరెడ్డి కోరారు. శుక్రవారం చాట్రాయి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లంక నిర్మల అధ్యక్షతన ఎంపీడీవో ఎం మురళీమోహన్ మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన దేశిరెడ్డి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు ప్రతాప సహయ సహకారాలతో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రస్థాయిలో తనకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించారన్నారు. అందరం సమిష్టిగా పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. చాట్రాయి మండలం అభివృద్ధిలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం తీసుకొచ్చే విధంగా తాను పనిచేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.శాఖల పనితీరుపై ఆయన సమీక్షించారు. సమావేశానికి గైర్హాజరైన అధికారులు పై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోని ఆదేశించారు. పర్వతాపురం సర్పంచ్ మిద్దే శివాజీ మాట్లాడుతూ మాగ్రామానికి 104వాహన రావడంలేదని 115 మంది పైగా రోగులు వున్నారని వారందరిని బురుగు గూడెం రమ్మంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ చెప్పేదానికి మీరు చేసే దానికి పొంతన లేదని ఇలా అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. సోమవారం గ్రామపంచాయతీ సర్పంచ్ శోభన్ బాబు ఫామాయిల్ మొక్కలు కోసం 5నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నా నేటికీ అతీగతీ లేదని పామాయిల్ మొక్కలు ఎప్పుడు సరఫరా చేస్తారని వ్యవసాయ అధికారిని ప్రశ్నించారు. మండల పరిషత్ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సుబ్బారెడ్డి మాట్లాడుతూ కోనేరు రంగారావు పదవీకాలంలో అంగన్వాడీ భవనం నిర్మాణం ప్రారంభించామని నేటికి పూర్తి కాకపోవటం పట్ల అభ్యంతరం తెలిపారు. సమావేశంలో జడ్పిటిసి చెలికాని అనూష, తహశీల్దార్ విశ్వనాథరావు, డాక్టర్ ఆఫ్రినా సుల్తానా, మండల పరిషత్ ఉపాధ్యక్షులు జగన్మోహన్రావు, కొత్తగూడెం సర్పంచ్ చల్లగుళ్ళ వెంకటేశ్వరరావు, పోలవరం సర్పంచ్ లక్ష్మి ,చాట్రాయి ఎంపిటిసి ఎస్ .శివకూమారి, చింతకుంట్ల వెంకటేశ్వరరావు, చీపురుగూడెం ఎంపిటిసి మోరంపూడి రాణి తదితరులు పాల్గొన్నారు.