న్యూదిల్లీ : యువ రెజ్లర్ సాగర్ ధనకర్ రాణా హత్య కేసులో నిందితుడు, ఒలింపిక్స్ పతక విజేత సుశీల్ కుమార్ బెయిల్ పిటిషన్ను దిల్లీ కోర్టు తిరస్కరించింది. అడిషనల్ సెషన్స్ జడ్జి శివాజీ ఆనంద్.. సుశీల్ కుమార్కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. సాగర్ను అడవి పందిని వేటాడినట్లు వేటాడి క్రూరంగా హింసించి చంపారని బాధితుడి తరఫు న్యాయవాది, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ కుమార్ శ్రీ వాస్తవ కోర్టుకు తెలిపారు. కాగా సుశీల్ కుమార్ తరఫు న్యాయవాది, తన క్లయింట్ను కావాలనే కేసులో ఇరికించారని, మృతుడి మరణ వాంగ్మూలాన్ని 40 రోజులు ఆలస్యంగా కోర్టుకు సమర్పించారని వాదించారు. ఈ కేసులో మొత్తం 13 మందిపై ఐపీసీ 302, 307, 147 సెక్షన్ల కింద చార్జ్షీట్ దాఖలు చేశారు. కాగా, మే 4న దిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియం వద్ద 23 ఏళ్ల సాగర్ ధనకర్ రాణాను హత్య చేసిన కేసులో సుశీల్ కుమార్ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే. సుశీల్.. 2008, 2012 ఒలింపిక్స్లో కాంస్యం, రజత పతకాలు సాధించాడు.