అభివృద్ధి మాటున ఆడిటింగ్లో అడ్డగోలు దోపిడీ
ఉన్నతస్థాయి అధికారులకు మస్కా..
ప్రభుత్వ పథకాల్లో తిలా పాపం తలా పిడికెడు..
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలకు అందని ప్రగతి ఫలాలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల మాటున అవినీతి రాజ్యమేలుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తుంటే.. అక్రమార్కుల యథేచ్ఛ దోపిడీతో ప్రగతి ఫలాలు ప్రజలకు అందకుండా పోతున్నాయి. అవకాశం ఉన్న మేరకు అడ్డంగా దోచుకునేందుకు అండగా ఆడిటింగ్ అధికార యంత్రాంగం పచ్చజెండా ఊపడంతో క్షేత్రస్థాయిలో అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. దోచిన దాంట్లో మాకు పర్సంటేజీ ముట్టచెబితే మీపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా నివేదికలు సిద్ధం చేస్తామని హామీలు ఇచ్చి క్షేత్రస్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, వ్యాపారులకు ఆడిట్ అధికారులు తోడుకావడంతో వీరి సంపాదన మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. గ్రామాల నుండి పట్టణాల వరకు అభివృద్ధి జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు చివరికి జిల్లా మంత్రిని కూడా బురిడీ కొట్టించి అభివృద్ధి మాటున అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా కోట్ల రూపాయల నిధులు అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అనేక పథకాలు, అభివృద్ధి పనుల్లో అవినీతి తారస్థాయికి చేరింది. గ్రామాలలో జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాలు, సీసీ రోడ్లు, భవన నిర్మాణాలు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, మట్టి పనులు, బీటీ రోడ్లు వంటి అనేక అంశాలలో జరుగుతున్న అక్రమాలను ఆడిటింగ్ అధికారులే వెలికితీయాలి. జిల్లాలో 909 పంచాయతీలు ఉండగా దాదాపు 200 మేజర్, మైనర్ పంచాయతీలలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆడిటర్లు గుర్తించారు. ఈ పంచాయతీలపై చర్యలకు సిఫార్సు చేయాల్సి ఉండగా కేవలం 10 శాతం పంచాయతీల పైన మాత్రమే చర్యలు తీసుకోవాలని నివేదిక పంపడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మిగిలిన వాటిపై చర్యలు తీసుకోకుండా పర్సెంటేజ్ వ్యవహారాన్ని కొందరు అధికారులు కొనసాగిస్తున్నారు. అక్రమాలు గుర్తించిన బిల్లుపై రెండు శాతం కమిషన్ ఒప్పందం కుదుర్చుకుని అక్రమాలను సక్రమం చేసుకుంటున్నారు. అభివృద్ధి పనులలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాపారులతో కొందరు ఆడిట్ అధికారులు ఒప్పందం కుదుర్చుకుని అడ్డగోలు దోపిడీకి తెర తీశారు. రెండు శాతం కమిషన్ రావడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆడిటర్లు అధిక సంఖ్యలో అక్రమాల చిట్టా పట్టుకున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు వీరి మాటలను పెడచెవిన పెట్టడంతో వారిపై చర్యలు తీసుకోవాలని నివేదికలు సిద్ధం చేశారు. గత రెండేళ్లుగా కొవిడ్ మహమ్మారి కారణంగా అధికభాగం పంచాయతీల ఆడిట్లన్నీ ఆన్లైన్లోనే జరిగాయి. ఈ విషయంపై ఉన్నతాధికా రులు చూసీచూడనట్లుగా వదిలేశారు. దీంతో అనేక మంది ప్రజా ప్రతినిధుల కు, అధికారులు, వ్యాపారులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రతి ఏటా మేజర్ గ్రామ పంచాయతీలలో రూ.కోటికి పైగానే అభివృద్ధి పనులు జరుగు తాయి. ఇక పట్టణాలలో లెక్కలేని విధంగా నిధుల వరద పారుతోందని చెప్పవచ్చు. పారిశుద్ధ్యం, వీధిలైట్లు హరితహారం రహదారుల నిర్మాణం వంటి పనుల విషయంలో సంబంధం లేకుండా బిల్లులు సృష్టించినప్పటికీ ఆడిటర్లు గుర్తించినా చర్యలు లేకపోవడం గమనార్హం. అక్రమాలను జిల్లా మంత్రికి, కలెక్టర్కు తెలియకుండా జాగ్రత్త పడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు జిల్లాలో జరుగుతున్న వేలకోట్ల రూపాయల అభివృద్ధి పనులలో ఆడిట్ అధికారులు గుర్తించిన అవినీతి అంశాలపై చర్యలు తీసుకుంటే జరిగిన తప్పులు మరిన్ని వెలుగు చూసే అవకాశం ఉంటుంది.