చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడ్ ఎస్టేట్లో జరిగిన హత్యలు, దోపిడీల కేసులో బహిష్కృత అన్నాడీఎంకే అధినేత వీకే శశికళను గురువారం రాష్ట్ర పోలీసులకు చెందిన ప్రత్యేక బృందం ప్రశ్నించింది. ఈ హత్యలు, దోపిడీ అప్పట్లో సంచలనాత్మకమైన సంగతి విదితమే. చెన్నై టీ నగర్లోని తన నివాసంలో శశికళను పోలీసులు ప్రశ్నించారు. శశికళ అవినీతి కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఎస్టేట్లో సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు. బంగ్లా కూడా కొంతమేరకు ధ్వంసమైంది. ఆ సమయంలో వాచ్, క్రిస్టల్ ఖడ్గమృగం, కొన్ని వస్తువులు అపహరణకు గురయ్యాయని పోలీసులు తెలిపారు. అదేసమయంలో జరిగిన నాలుగు అనుమానాస్పద మరణాలు కేసును మరింత జటిలం చేశాయి. ముందుగా ఈ కేసులో ప్రధాన నిందితుడు, జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజ్ ఎడప్పాడీకి సమీపంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అదే రోజు రెండవ నిందితుడు సయాన్ ప్రమాదానికి గురయ్యాడు. అతడు ప్రమాదం నుండి తప్పించుకోగా.. ఆయన భార్య, కుమార్తె చనిపోయారు. అనంతరం ఎస్టేట్లోని కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జయలలిత మరణం తర్వాత చోటుచేసుకున్న ఈ హత్యలను అప్పటి రాజకీయ పరిణామాలకు ముడిపెట్టారు.