మరో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం
న్యూదిల్లీ/చండీగఢ్: హరియాణాలో రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సమూలంగా మార్చివేసింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన కుమారి సెల్జాను తప్పించి..ఆమె స్థానంలో ఉదయ్భాన్ను నియమించింది. నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు కట్టబెట్టింది. ఉదయ్ భాన్ మాజీ శాసనసభ్యుడు, భూపీందర్సింగ్ హుడా అనుచరుడు. రాష్ట్ర పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా శృతి చౌదరి, రామ్ కిషన్ గుజ్జార్, జితేందర్ కుమార్ భరద్వాజ్, సురేశ్ గుప్తాలను నియమించింది. కుమారి సెల్జా రాజీనామాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వెంటనే ఆమోదించారు. ఈ వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ అధికారిక ప్రకటనలో వెల్లడిరచారు. కుమారి సెల్జా సేవలను పార్టీ ప్రశంసించినట్లు ప్రకటన పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి హుడా తన పట్టు నిలుపుకున్నారు. అనుచరుడికి పార్టీ పగ్గాలు వచ్చేలా పావులు కదిపారు. 66 ఏళ్ల భాన్ మాజీ ఎమ్మెల్యే గయాలాల్ కుమారుడు. ఆయన షెడ్యూల్డ్ కులాల నాయకుడు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989`1993 మధ్యకాలంలో క్రిభ్కో చైర్మన్గా పనిచేశారు. కొద్దిరోజుల క్రితం పార్టీ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేశానని, పార్టీకి తాను నిజమైన సైనికురాలిగా పనిచేస్తానని సెల్జా పీటీఐతో అన్నారు. ‘నేను కాంగ్రెస్ పార్టీకి నిజమైన సైనికురాలిని. పార్టీ అధిష్ఠానంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మేమంతా కలిసి పార్టీ కోసం పనిచేస్తాం. కొత్త అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షులకు అభినందనలు’ అని సెల్జా చెప్పారు. భాన్ కష్టపడి పనిచేసే నాయకుడని హుడా పేర్కొన్నారు. ఆయన నియామకం పార్టీ పటిష్టతకు దోహదపడుతుందని చెప్పారు. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం గురించి ప్రస్తావిస్తూ అందరూ కలిసి పనిచేస్తారని, కాంగ్రెస్ను పటిష్టవంతం చేస్తారని హుడా చెప్పారు.