మూసేస్తాం.. ఆమ్మేస్తామంటే తరిమేస్తాం
కార్మిక సంఘ నేతల హెచ్చరిక
విశాలాంధ్ర,విజయవాడ (గాంధీనగర్)/ మచిలీపట్నం : ఎందరో మహానుభావుల త్యాగాలు, ఫోరాటాల ఫలితంగా వచ్చిన విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, కేంద్రం ఎన్ని కుయుక్తులు పన్నినా దీనిని కాపాడుకుంటామని కార్మిక సంఘ నేతలు ప్రతిన బూనారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవే టీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న అందోళనలు 500 రోజులు పూర్తియిన నేపథó్యంలో విశాఖ ఉక్కు పరి రక్షణ పోరాట ఐక్య వేదిక అధ్వర్యంలో సోమవారం విజయవాడ ధర్నాచౌక్ వద్ద కార్మిక సంఘాల అధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన ధర్నా చేపట్టారు.ఈ ధర్నాను ఉద్దేశించి ఎఐటీయుసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మే యోచనను కేంద్రం వెంటనే ఉపసంహరించుకొవాలని డిమాండ్ చేశారు. ఉక్కు ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గకుంటే వచ్చే నెల 4న రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకుం టామని హెచ్చరించారు.
స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం గత 500 రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా అనేక పోరాటాలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం దీనిపై చిత్తశుద్ధితో కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. అమ్మేస్తాం… మూసేస్తాం అని అంటే దేశ ప్రజలు మోదీని తరిమేస్తారని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి యు.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను పోరాటాలతో అడ్డుకుంటా మన్నారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎమ్ సాంబశివరావు, కేఆర్ ఆంజనే యలు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సీహెచ్వీ రమణ,హకర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొట్టు రమణ,మూఠా కార్మిక సంఘం అధ్యక్షులు శ్రీరామచంద్రమూర్తి ప్రధాన కార్యదర్శి వియ్యపు నాగేశ్వరరావు, సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు నక్కా వీరభద్రరావు, నాగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బి. తిరుపతయ్య, రామస్వామి,ఎం కొండ, సీఐటీయూ జిల్లా నాయకులు ఎ.వెంకటేశ్వరరావు, ఎంవీ సుధాకర్, వైఎస్సార్టీయూ నాయకులు శివరామకృష్ణ, విశ్వనాధ రవి, ఐఎఫ్టియు నాయకులు రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నంలో: అమరుల త్యాగఫలమే విశాఖ ఉక్కు కర్మాగారమని, దానిపై కేంద్రం వైఖరి మార్చుకోకపోతే మూల్యం తప్పదని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్, ్శ తాటిపర్తి తాతయ్య అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని, విశాఖ ఉక్కు పరిరక్షణ ఐక్య వేదిక అధ్వర్యంలో సోమవారం మచిలీపట్నం రేవతి హాల్ సెంటర్లో నిరసన కార్యక్రమం జరిగింది. సీపీఐ జిల్లా సీనియర్ నాయకులు మోదుమూడి రామారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.5 కోట్లు మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడి పెట్టిందని, ఇప్పటికే రూ.44 వేల కోట్లు డివిడెండ్ల రూపంలో ప్రభుత్వానికి వచ్చిందని, 22వేల ఎకరాల్లో 33వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమను కార్పొరేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం సరికాదన్నారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి బూర సుబ్రమణ్యం, మునిసిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కరపాటి సత్యనారాయణ, సీపీఐ నాయకులు మోతుకూరి అరుణకుమార్, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎగోని గాంధీ మాట్లాడారు.
ఏఐటీయూసీ నాయకులు యర్రంశెట్టి ఈశ్వరరావు, కర్నాటి అర్జున్రావు, కరపాటి స్వామి, తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో : ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం వెలగలగూడెంలో విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఫీుభావంగా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు సీహెచ్ కోటేశ్వర రావు, సీపీఐ మైలవరం నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు రమేష్, ప్రజా సంఘాల నాయకులు సీహెచ్ దుర్గా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.