కొలంబో: శ్రీలంక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే (73) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ 8వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. బుధవారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో రణిల్కు అనుకూలంగా 134 ఓట్లు పోలైన విషయం తెలిసిందే. రణిల్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైనా.. ప్రజల్లో మాత్రం అసహనం ఉంది. ఆయనకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో రణిల్ తప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దేశం విడిచి పరారీ అయిన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. తాత్కాలిక దేశాధ్యక్షుడిగా రణిల్ను నియమించారు.ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అన్ని ప్రయత్నాలు చేయనున్నట్లు రణిల్ తెలిపారు. శ్రీలంక పార్లమెంటు తమ దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవడం గత 44ఏళ్లలో ఇదే తొలిసారి. దేశ ప్రధానిగా రణిల్ ఆరుసార్లు పనిచేసే అనుభవం ఉంది. నాలుగున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో రణిల్ అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు.