రాష్ట్ర హోంశాఖ మంత్రికి గోడు చెప్పుకుందామని వెళ్లిన… బాధితులపై ఓ పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించారు. వారిపై దాడి చేశారు. ఇది కర్ణాటకలో జరిగింది. అక్కడ ఇటీవల పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ జరిగింది. ఆ రిక్రూట్మెంట్లో భారీగా అవకతవకలు జరిగాయి. దీనివల్ల నష్టపోయిన బాధితులు రాష్ట్ర హోంమంత్రికి తమ గోడు చెప్పుకోవాలని భావించారు. ఈ మేరకు బాధితులు మంగళవారం తుమకూరులో గల కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఇంటికి వెళ్లారు. అక్కడ పెద్దఎత్తు గుమిగూడారు.అయితే అక్కడ కాపలాగా ఉన్న తుమకూరు పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో కొంతసేపు పోలీసులకు, బాధితులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా తుమకూరు డిప్యూటీ ఎస్పీ పీ శ్రీనివాస్ సహనం కోల్పోయారు. వచ్చిన బాధితులపై దురుసుగా ప్రవర్తించారు. వచ్చిన వారిపై గద్దించడమే కాకుండా.. దాడికి పాల్పడ్డారు. ఓ బాధితుడిని చెంపపై కొట్టి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. అయితే పోలీసు అధికారి చేసిన పనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.