ఎల్కేజీ నుంచి 12 వరకు ఆరు రకాలుగా పాఠశాలల వర్గీకరణ
44 వేల స్కూళ్లు 58 వేలకు పెరుగుదల
విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్ల నియామకం
16న పశ్చిమలో విద్యాకానుక ప్రారంభం బ సమీక్షలో సీఎం జగన్ వెల్లడి
విశాలాంధ్ర బ్యూరో అమరావతి : రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి అమలు చేయనున్న నూతన విద్యావిధానంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం నూతన విద్యావిధానంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా నూతన విద్యావిధానం గురించి వివరిస్తూ అంగన్వాడీల నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇప్పుడున్న పాఠశాలల స్వరూపం పూర్తిగా మారి, మొత్తం ఆరు రకాలుగా వర్గీకరణ జరుగుతుందన్నారు. వీటిలో శాటిలైట్ స్కూల్స్(పీపీ
1, పీపీ-2), ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ-1, పీపీ-2. 1, 2), ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్(పీపీ-1 నుంచి 5వ వరగతి వరకూ), ప్రీ హైస్కూల్స్(3 నుంచి 7 లేదా 8వ తరగతి వరకు), హైస్కూల్స్ (3 నుంచి 10వ తరగతి వరకు), హైస్కూల్ ప్లస్ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) ఉంటాయన్నారు. దీనివల్ల ఇప్పుడున్న పాఠశాలలు 44 వేల నుంచి సుమారు 58 వేలకు పెరుగుతాయన్నారు. ముఖ్యంగా 3వ తరగతి నుంచి విద్యార్థులకు వివిధ సబ్జెక్టులలో విషయ నిపుణులైన టీచర్ల ద్వారా చక్కటి బోధన అందించడానికి తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను పెట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అందరికీ ఇంగ్ల్లీషు మీడియంలో బోధన అందుతుందని, దీనివల్ల ప్రపంచ స్థాయిలో పోటీలను తట్టుకునేలా విద్యార్థులు తయారు అవుతారన్నారు. ఇప్పటి వరకు సింగిల్ టీచర్తో నడుస్తున్న స్కూళ్లలో కూడా వర్గీకరణ ద్వారా విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా, సబ్జెక్టులను వేర్వేరు టీచర్లు బోధించే పరిస్థితులు వస్తాయి. ఉపాధ్యాయులపై పని భారం కూడా తగ్గుతుంది. అర్హతలున్న అంగన్వాడీ టీచర్లకు కూడా ప్రమోషన్ ఛానల్ ఏర్పడుతుందని సీఎం వివరించారు. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్గా బోధించాలని సీఎం స్పష్టం చేశారు. నూతన విద్యావిధానం, నాడు-నేడుల కోసం మొత్తంగా సుమారు రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, దీనిపై ప్రజలందరిలోనూ అవగాహన తీసుకురావాలని సూచించారు. నూతన విద్యా విధానంపై కలెక్టర్లు, జేసీలు, డీఈఓలు, పీడీలకు అవగాహన కల్పించాలని, ప్రత్యేకంగా ఒక ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈనెల 16న విద్యాకానుక ప్రారంభించనున్నట్లు సీఎం వెల్లడిరచారు. అమ్మ ఒడి, ఇంగ్లీషు మీడియం, నాడు-నేడు తదితర కార్యక్రమాల వల్ల క్షేత్రస్థాయిలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయని సీఎంకు అధికారులు వివరించారు. ప్రభుత్వ విద్యారంగంపై నమ్మకం పెరిగిందని, అమ్మ ఒడి ద్వారా పిల్లలను బడికి పంపాలన్న కోరిక బలపడిరదని తెలిపారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.ఆర్.అనురాధ, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.