టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను ఆయన నివాసంలో నందమూరి తారకరత్న మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబపరమైన అంశాలతో పాటు రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు. తారకరత్న గతంలో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. అప్పుడప్పుడు అగ్రనేతలకు మద్దతుగా తన గళం వినిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో, ఆయన వచ్చే ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇవాళ లోకేశ్ తో సమావేశంలోనూ తారకరత్న పోటీ చేసే నియోజకవర్గం అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి నందమూరి కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని కూడా లోకేశ్ తో తారకరత్న చెప్పినట్టు సమాచారం.