సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మహాధర్నా చేపట్టాయి. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మోదీ హటావో సింగరేణి బచావో అంటూ నినాదాలు చేస్తున్నారు. రాష్ట్రంపై ప్రధాని సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు మహాధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేస్తున్నారు.భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల, గోదావరిఖని, రామగుండం, మందమర్రి, నస్పూర్, ఇల్లందులో ధర్నాకు దిగారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గోదావరిఖనిలో టీబీజీకేఎస్ నేత కెంగర్ల మల్లయ్య ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్లపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బొగ్గుగనుల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.కాగా, బొగ్గుబ్లాకుల ప్రైవేటికీరణకు వ్యతిరేకంగా భూపాలపల్లిలో నిర్వహించనున్న ధర్నాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ పాల్గొననున్నారు. కొత్తగూడెంలో మంత్రి పువ్వాడ, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు సింగరేణి ధర్నాలో పాల్గొని నిరసన తెలుపనున్నారు. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తా దగ్గర నిర్వహించే మహాధర్నాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొంటారు.