రూ.502 కోట్లతో ముస్తాబవుతున్న ఐదు స్టేడియాలు
ముంబై: ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లను ఆస్వాదిస్తున్న క్రికెట్ అభిమానులు… భారత్లో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మహా సమరానికి మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఇక ఐదు ప్రధాన స్టేడియాలకు మరమ్మతులు చేసి, వాటికి కొత్త కళ తెచ్చేందుకు బీసీసీఐ ఏర్పాట్లు మొదలుపెట్టింది. అందుకోసం భారీ మొత్తంలో రూ.502.92 కోట్లు ఖర్చు చేయనుంది. ఇంతకు ఆ ఐదు స్టేడియాలు ఏవంటే..? దిల్లీ స్టేడియం, వాంఖడే(ముంబై), మొహాలీ (పంజాబ్), రాజీవ్ గాంధీ(హైదరాబాద్), ఈడెన్స్ గార్డెన్( కోల్కతా). ఈడెన్స్ గార్డెన్ మైదానా నికి రూ. 117.17 కోట్లతో మరమ్మతులు చేపట్టనున్నారు. దిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం మరమ్మతుల కోసం రూ. 100 కోట్లు, హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియాన్ని ముస్తాబు చేయడం కోసం రూ.117.7 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. పంజాబ్లోని మొహాలీ స్టేడియం మరమ్మతు కోసం రూ.79.46 కోట్లు, ముంబైలోని వాంఖడే మైదానాన్ని సుందరీకరించేందుకు రూ.78.82 కోట్లు కేటాయించారు.
షార్ట్ లిస్ట్లో 20 మంది ఆటగాళ్లు: ఈ ఏడాది అక్టోబర్` నవంబర్ మధ్యలో వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ఇప్పటికే టీమిండియా, ఆస్ట్రేలియాతో సహా తొమ్మిది జట్లు అర్హత సాధించాయి. 2011లో స్వదేశంలో విశ్వ విజేతగా నిలిచిన భారత్ ఈసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. ప్రపంచకప్ సన్నద్ధత కోసం బీసీసీఐ 20 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. అగ్రశ్రేణి ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి ఫామ్లో ఉండడం టీమిండియాకు కలిసి రానుంది. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ ఆసీస్ సిరీస్లో ఇరగదీశారు. షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ రూపంలో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. సొంతగడ్డపై రోహిత్ సేన ట్రోఫీ నెగ్గుతుందా? మూడోసారి వరల్డ్ కప్ చాంపియన్గా నిలుస్తుందా? అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.