తనను తీహార్ జైల్లో వేసినా.. జైలు నుంచి నామినేషన్ వేసి గెలుస్తానని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. తనను ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల మధ్య తిరగకుండా అడ్డుకొనేందుకు కుట్ర పన్ని తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే హోం మంత్రి పదవిని మహిళకే ఇవ్వాలని కోరారు. తనను తీహార్ జైల్లో పెట్టినా పోటీ చేసి గెలుస్తానని, అన్నింటికీ సిద్ధమయ్యే రాజకీయాల్లోకి వచ్చినట్లు భూమా స్పష్టం చేశారు. ఏవీ సుబ్బరెడ్డి పార్టీలో ఉంటే.. ఈ నాలుగు సంవత్సరాలు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఉన్న గుంట నక్కల గురించి నారా లోకేష్ చూసుకుంటారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. ఆళ్ళగడ్డ ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. నంద్యాలలో మీడియాతో మాట్లాడిన ఆమె పోలీసులు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.ఇక కొంత కాలంగా అఖిలప్రియ, సుబ్బారెడ్డి వర్గాల మధ్య వర్గపోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తపల్లి వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత ముదిరింది. అఖిలప్రియ మద్దతుదారుడు సుబ్బారెడ్డిపై దాడి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులోనే అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. నారా లోకేశ్ సమక్షంలోనే టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. అప్పట్లో దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు.