బీజింగ్: చైనాలో విషాదం చోటు చేసుకుంది. నైరుతి ప్రావిన్స్ సిచువాన్లో ఆదివారం కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో 19 మంది మృతి చెందారని ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది. సిచువాన్ ప్రావిన్స్ లోని లెషాన్ నగరానికి సమీపంలో జింకోహే జిల్లాలోని యోంగ్షెంగ్ టౌన్షిప్లోని అటవీ క్షేత్రంలో ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ‘జిన్హువా’ వార్తా సంస్థ తెలిపింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక అధికారులు తెలిపారు. 14 ప్రత్యేక సహాయ పరికరాలతో 180 మందికి పైగా సహాయ సిబ్బందిని రంగంలోకి దింపినట్లు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన వార్తాపత్రిక పీపుల్స్ డైలీ అధ్వర్యంలో కొనసాగే రోజువారీ టాబ్లాయిడ్ ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది. కొండ చర్యలు పడిపోయి చుట్టుపక్కల నిర్మాణాలపై పడ్డాయని తెలిపింది. ఇందులో అనేక వసతి గృహాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన బాధితుల్లో ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు చెందినవారేనని స్థానికులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఈ కుగ్రామం మునిగిపోయిందన్నారు. కాగా… ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి.