ఉత్తరప్రదేశ్లో క్షేత్రస్థాయి అంతర్గత నివేదిక బీజేపీని ఆందోళన పరుస్తోంది. రాష్ట్రంలోనే భిన్న ప్రాంతాల్లో ఆ పార్టీ పరిస్థితిపైన పార్టీ విశ్లేషకులు నివేదికలు అందచేశారు. వీటిపై ఆందోళన చెందిన నాయకత్వం ప్రతి నియోజకవర్గంలో ఎంపీ కార్యకలాపాలను, ప్రజలలో వారికిగల ఆదరణపైన నివేదికలు పంపాలని కేంద్ర నాయకత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో గెలవాలని బీజేపీ ఆశిస్తున్నది. దిగువస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ఎన్డీఏ ఉనికిని కాపాడుకోవడం ద్వారా ఎక్కువ సీట్లు గెలవవచ్చునని బీజేపీ భావిస్తోంది. 2014లో బీజేపీ 71సీట్లలో గెలిచింది. అప్నా దళ్(సునేలాల్), ఏడీ(ఎస్), పార్టీలు రెండు సీట్లు గెలవడంతో ఎన్డీఏ బలం 73కు పెరిగింది. 2019లో పుల్వామా దాడిపై తమ గొప్పతనాన్ని చాటుకుంటూ ప్రచారం చేసినప్పటికీ బీజేపీ 14 సీట్లలో ఓడిపోయింది. ఇప్పటి పరిస్థితిని అంచనావేయగా, బీజేపీ మరింత దిగజారినట్లు తెలుస్తోంది. 2019లో 62 సీట్లలోనే గెలుపొందింది. ఏడీ(ఎస్) రెండు స్థానాల్లో గెలవగా ఎన్డీఏ బలం 64 అయింది. 2014 నుంచి బీజేపీ బలం క్రమక్రమంగా తగ్గుతోంది. 2024లో జరగనున్న లోకసభ ఎన్నికల్లో సైతం బీజేపీని ఆందోళనపరచే పరిస్థితే నెలకొంది. ఈ సారి బీజేపీ కేవలం కులం, మతం ఆధారంగా హిందువుల ఓట్లను మాత్రమే రాబట్టుకునేట్లయితే అది ఎక్కువ సీట్లు అశించడం కష్టం. 2019నాటి నుంచి ఓబీసీలు అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్వాదివైపు ఆకర్షితులయ్యారు.
2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాది పార్టీ 111సీట్లు గెలుపొందింది. అంటే ఓబీసీలు సమాజ్వాది పార్టీని బలపరచినట్లుగా స్పష్టమైంది. ఆ పార్టీ 2017లో 47 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇటీవల ప్రతిపక్షాల బలం పెరుగుదల, సమాజంలో పరిణామాలు సమాజ్వాది పార్టీ, దాని మిత్రపార్టీలు మరింత బలం పుంజుకున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలో కేంద్ర హోంమంత్రి అమిత్షా రాష్ట్రంలో ఎన్డీఏను పటిష్టం చేసుకోవాలని కృషి చేస్తున్నాడు. ఓబీసీల నాయకుడు కీ.శే. సునేలాల్ పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన సభలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విచ్ఛిన్నకర శక్తులను పూర్తిగా తుడిచివేస్తామని అన్నారు. సొనేలాల్ పార్టీ అప్నాదళ్తో బీజేపీ తర్వాత సమాజ్వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. రాష్ట్రంలో ఎక్కువగా సమాజ్వాదీనే ఓబీసీల ఓట్లను ఎక్కువగా పొందగలిగింది. అలాగే దళితుల ఓట్లను బీఎస్పీ ఎక్కువగా ఆకర్షించింది. అప్నాదళ్(ఎస్) ఓబీసీల ఓట్లను గణనీయంగా పొందినప్పటికీ అది పరిమిత ప్రాంతాలలోనే ఆదరణ కలిగి ఉంది. ఈసారి ఆ పార్టీని దగ్గరకు చేర్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అప్నాదళ్కు 2019లో 1.21శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఈసారి సమాజ్వాది పార్టీ కాంగ్రెస్తోనూ ఇతర చిన్న పార్టీలతోనూ పొత్తుపెట్టుకోవచ్చునని భావిస్తున్నారు.
ప్రతిపక్షాల పట్నా సమావేశానికి అఖిలేష్యాదవ్ కూడా హాజరయ్యారు. ఆర్ఎల్డీకి లభించిన 1.6శాతం ఓట్లు కూడా ప్రతిపక్షాలతో ఏర్పడనున్న ఫ్రంట్కే దక్కవచ్చు. 2014లో బీజేపీ ఓట్లశాతం 42.63శాతం కాగా, 2019లో 48.98శాతం ఓట్లు పొందింది. అయితే ఆ తర్వాత కాలంలో చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఓట్ల శాతం తగ్గడంతో 14సీట్లలో ఓడిపోయింది. ఈసారి బీజేపీ గతంలో తెచ్చుకున్నన్ని ఓట్లు పొందలేదని అంచనాఉంది. ఇప్పటి పరిస్థితుల్లో అప్నాదళ్ ఎదుగుదల దాదాపు ఆగిపోయింది. లోకసభ ఎన్నికలలో దాని ఓట్ల శాతం గణనీయంగా తగ్గి అది బలహీన పడుతుందని అందువల్ల ఓబీసీ ఓట్లు ఎక్కువగా బీజేపీకి రాకపోవచ్చునని భావిస్తున్నారు.
ఇక బీఎస్పీ దళిత రాజకీయాలను అనుసరిస్తున్నది. 2014లో అదిఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే 19.77శాతం ఓట్లను తెచ్చుకుంది. బీజేపీ బాగా దెబ్బతిని 7.5 ఓట్లు మాత్రమే పొందింది. ఫలితంగా 2019లో ఆ పార్టీ 71 సీట్లను గెలుచుకుంది. బీఎస్పీ అంతకుముందు వలే 19.43శాతం ఓట్లు తెచ్చుకుని ఈ సారి 10సీట్లను గెలుచుకుంది. 2014లో వచ్చిన ఓట్లకంటే 0.34శాతం ఓట్లు తగ్గాయి కూడా. 2022లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితం బీజేపీ నాయకత్వాన్ని తీవ్రంగా ఆందోళనకు గురి చేసింది. 2017లో 309 సీట్లను గెలుచుకున్న బీజేపీ 2022లో తీవ్ర కృషి అనంతరమే 255సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. 2022లో బీఎస్పీ ఓట్లు అంతక్రితం కంటే 1శాతం తగ్గినప్పటికీ 111సీట్లు సాధించింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం కేవలం 41.29మాత్రమే ఉంది. 2017లో గెలుచుకున్న సీట్ల కంటే 2022లో 57సీట్లను కోల్పోయింది.
`ఎడిట్ పేజి డెస్క్