తెలంగాణ విద్యా వ్యవస్థ గురించి తెలుసుకోకుండా, బొత్స సత్యనారాయణ ఇష్టానుసారం మాట్లాడటం సరికాదు అని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థ మెరుగుపడిందని కమలాకర్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణలో కేవలంలో 297 గురుకులాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు గురుకులాల సంఖ్య 1009కి చేరిందన్నారు. రాష్ట్ర గురుకులాల్లో ఇప్పుడు పది లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటికీ గురుకులాల సంఖ్య పెరగలేదని కమలాకర్ తెలిపారు. ఏపీలోని గురుకులాలను పదో తరగతి వరకు పరిమితం చేశారని చెప్పారు. ఎన్నో ఏండ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణపై ఇంకా విషం చిమ్మడం సరికాదని కమలాకర్ పేర్కొన్నారు. నాడు ఉమ్మడి ఏపీలోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా బొత్స మాట్లాడారని గుర్తు చేశారు. టీఎస్పీఎస్సీలో తప్పు జరిగితే పట్టుకుంది ప్రభుత్వమే అని చెప్పారు. తప్పు చేసినవారిని శిక్షిస్తున్నాం. కానీ ఏపీలో ఉద్యోగాలను దొంగదారుల్లో అమ్ముకుంటున్నారు. కనీసం ఒక్కరినైనా పట్టుకున్నారా బొత్స చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాలో ఎమ్మెల్యేలు, ఏపీపీఎస్సీ మెంబర్లే వసూళ్లు చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు. బొత్స సత్యనారాయణ వీటన్నింటిపై సాయంత్రం లోపు స్పందించాలి అని గంగుల కమలాకర్ సవాల్ విసిరారు.