56 స్థానాలకు ఎన్నికలు.. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ తేదీలివే..
దేశంలో లోక్సభ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్తో గడువు ముగియనున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 56 స్థానాలకు సంబంధించి ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 27 వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 6 స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి 3 స్థానాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 స్థానాలు ఉన్నాయి.
ఫిబ్రవరి 8 వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. ఫిబ్రవరి 15 వ తేదీ వరకు నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ అని ఈసీ వెల్లడించింది. ఫిబ్రవరి 16 వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. నామపత్రాల ఉపసంహరణకు ఫిబ్రవరి 20 వ తేదీని చివరి తేదీ అని పేర్కొంది.
చివరికి ఫిబ్రవరి 27 వ తేదీన పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఓటింగ్ పూర్తైన తర్వాత అదే రోజు లెక్కింపు చేపట్టి ఫలితాలు వెలువరించనున్నారు. ఇక ఈ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాలు ఉన్న రాష్ట్రంగా 10 స్థానాలతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. బిహార్లో 6, మహారాష్ట్రలో 6, పశ్చిమ బెంగాల్లో 5, మధ్యప్రదేశ్ 5, గుజరాత్ 4, కర్ణాటక 4, ఒడిశా 3, రాజస్థాన్ 3, తెలంగాణ 3, ఆంధ్రప్రదేశ్లో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. హర్యాణా, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్ జరగనుంది.
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2 వ తేదీతో ముగియనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 6 స్థానాలు ఖాళీ అవుతుండగా.. అందులో తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 3 స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ల పదవీ కాలం ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం రమేశ్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ముగియనుంది. దీంతో ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.