అంబానీ ఇంటివద్ద పేలుడు కేసులో ఎన్ఐఏ చార్జిషీటు
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నివాసం ఎదుట పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపివేత కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో కీలక సూత్రధారి ఇన్స్పెక్టర్ సచిన్ వాజేనే అని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)పేర్కొంది. ‘సూపర్ కాప్’గా తన పాపులారిటీని తిరిగి తెచ్చుకోవాలని, అంబానీని బెదిరించి డబ్బు రాబట్టాలని వాజే ఈ కుట్ర పన్నినట్లు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ముంబైలోని అంబానీ నివాసం ఎదుట జిలెటిన్ స్టిక్స్తో ఉన్న ఓ కారు నిలిపి ఉంచడం కలకలం సృష్టించింది. ఈ కేసులో సచిన్ వాజే సహా మరికొందరిని అరెస్టు చేసిన ఎన్ఐఏ ఇటీవల ప్రత్యేక కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ వ్యవహారం మొత్తాన్ని సచిన్ వాజేనే నడిపించినట్లు ఎన్ఐఏ చార్జ్షీట్లో పేర్కొంది. ఉగ్రవాదుల పేరుతో ప్రముఖులను భయభ్రాంతులకు గురిచేయడం…వారి నుంచి భారీగా డబ్బు దండుకోవాలనేది వాజే ప్లాన్ అని తెలిపింది. ఇలాంటి కేసులను తానే చేపట్టి ‘సూపర్కాప్’గా పాపులారిటీ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేసినట్లు వివరించింది.
ఫిబ్రవరి 25న సచిన్ వాజే స్వయంగా పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కారును తీసుకెళ్లి అంబానీ నివాసం ఎదుట పార్క్ చేశాడు. ఈ కారు వెనకాలే ముంబై క్రైం బ్రాంచ్కు చెందిన ఇన్నోవా వాహనం వచ్చినట్లు సీసీటీవీల్లో కన్పించింది. ఆ తర్వాత ఈ కేసును టేకప్ చేసిన వాజే…కుట్రను దాచిపెట్టేందుకు దర్యాప్తును పక్కదారి పట్టించాడు. మరోవైపు కార్లకు ఉపయోగించిన నకిలీ నంబరు ప్లేట్లకు సంబంధించిన పత్రాలు, సీసీటీవీ ఫుటేజ్ల ఎలక్ట్రానిక్ డీవీఆర్ వంటి సాక్ష్యాలు ధ్వంసం చేశాడు. ఈ సాక్ష్యాలను ముంబై, థానెలోని అనేక ప్రాంతాల్లో పడేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించింది. పేలుడు పదార్థాలతో కూడిన వాహనం యజమాని మన్సుఖ్ హీరేన్ హత్యకు కూడా వాజేనే పథకం వేసినట్లు ఎన్ఐఏ చార్జ్షీట్లో పేర్కొంది. తొలుత మన్సుఖ్ కూడా వాజేతోనే కలిసి పనిచేశాడు. కుట్రలో భాగంగా హీరేన్ తన కారు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దర్యాప్తులో అతడు కూడా నిందితుడని తేలింది. ఈ క్రమంలోనే మార్చి 5న హీరేన్ చనిపోయాడు. అంబానీకి బెదిరింపుల కేసును హీరేన్పై వేసేందుకు వాజే ప్రయత్నించాడు. ఘటనకు పాల్పడిరది తానేనని ఒప్పుకోవాలని హీరేన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అందుకు అతడు అంగీకరించకపోవడంతో హీరేన్ హత్యకు పథకం పన్నాడు. ఇందుకోసం తన స్నేహితుడైన ప్రదీప్ శర్మ అనే పోలీసును ఉపయోగించుకున్నట్లు ఎన్ఐఏ వివరించింది. కాగా, ఘటన జరిగిన తర్వాత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ తన గుజరాత్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఆంటిల్లా(అంబానీ నివాసం) సెక్యూరిటీ హెడ్ వెల్లడిరచారు. ఇంటిముందు కారును, బెదిరింపు లేఖను గుర్తించగానే వెంటనే అంబానీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే తమకు ఎవరిపైనా అనుమానాలు లేవని అంబానీ కుటుంబం చెప్పినట్లు తెలిసింది. పోలీసుల సూచన మేరకు నీతా అంబానీ తన గుజరాత్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సెక్యూరిటీ హెడ్ చెప్పారని ఎన్ఐఏ తమ చార్జ్షీట్లో పేర్కొంది.