సీఎం చంద్రబాబుకు సామాజిక నేతల అభ్యర్ధన
విశాలాంధ్ర – శ్రీకాకుళం: రాష్ట్రంలో 14 లక్షలకు పైగా జనాభా ఉన్న కళింగ సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు న్యాయం చేయాలని శ్రీకాకుళం జిల్లా కళింగసీమ సేవా సమితి అధ్యక్షులు హనుమంతు కృష్ణారావు, విజయనగరం జిల్లా అధ్యక్షుడు పేడాడ జనార్ధనరావు కోరారు. ఈ మేరకు నగరం లోని అఫీషియల్ కాలనీలో ఉన్న హనుమంతు కృష్ణారావు నివాసంలో విలేకరుల సమావేశంలో గురువారం మాట్లాడారు. కళింగులు అంటే కేవలం శ్రీకాకుళం జిల్లాకే పరిమితం కాదని, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఉన్నారన్నారు. ఒక్క విశాఖపట్నం నగరంలోనే లక్షకు పైగా జనాభా ఉన్న కళింగులు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈసంఖ్యకు పైగానే ఉన్నట్టు పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కళింగులకు రాష్ట్ర మంత్రి పదవి ఇచ్చారని, అదే సంప్రదాయాన్ని చంద్రబాబునాయుడు కొనసాగించగలరని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో రాష్ట్రమంత్రి, ప్రభుత్వ విప్ పదవులు ఇచ్చారని, 2024 మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి స్థానం లభించకపోవడం బాధగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు శాసనసభ్యులను గెలిపించుకోవడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ టిడిపి, మిత్రపక్ష కూటమి విజయం సాధించడంలోనూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో టిడిపి, మిత్రపక్ష కూటమి గెలుపులోనూ కళింగ సామాజికవర్గం ప్రముఖ పాత్ర పోషించిందని, కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా టిడిపి వెంట నడిచిన కళింగ సామాజిక వర్గం నేతలు ఉన్నారని, అందువల్ల కళింగులకు మంత్రి పదవి ఇచ్చి చంద్రబాబునాయుడు న్యాయం చేయాలని హనుమంతు కృష్ణారావు, పేడాడ జనార్ధనరావు కోరారు. ఇతర సామాజిక వర్గాలకు పదవులు ఇవ్వడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, జిల్లాలో ఎంత మంది ప్రజా ప్రతినిధులకు పదవులు ఇస్తే అంత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నామని, అయితే తమ సామాజిక వర్గం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా నుంచి మాత్రమే గెలుపొందిన ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బెందాళం అశోక్ ఉన్నందున మంత్రివర్గంలో వీరిలో ఎవరికి స్థానం కల్పించినా తమ సామాజికవర్గం సంతోషిస్తుందని హనుమంతు కృష్ణారావు, పేడాడ జనార్ధనరావు పేర్కొన్నారు. తమ అభ్యర్ధనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించాలని వారు కోరారు. విలేకరుల సమావేశంలో కార్యవర్గ సభ్యులు కె.టి.నాయుడు, బి. సన్యాసిరావు, రామ్మోహన్, రమేష్, వెంకటరావు, ప్రసాద్, కిరణ్, సాంబమూర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.