ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాలు, దీవెనలతో బాధ్యతలు తీసుకున్నారు. దారి పొడవునా భారీ స్వాగతాలతో సచివాలయానికి చేరుకున్న ఆయన అధికారిక ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. సచివాలయానికి వెళ్తున్న సమయంలో రాజధాని రైతులు, ఉద్యోగులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు, ప్రజలు భారీ స్వాగతం పలికారు.జై చంద్రబాబు.. జైజై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయనపై పూలు చల్లారు. సీడ్ యాక్సిస్ రోడ్డుకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.