ఒక లీటర్ డీజిల్ తో ఒక ఎకరా పంట కోత చేయవచ్చు…
రైతు కృష్ణాపురం రియాజ్ అహ్మద్
విశాలాంధ్ర ధర్మవరం:: దేశంలో నేడు వ్యవసాయం అనేది చాలా కష్టతరంతో కూడుకున్న పని. ఇటువంటి వ్యవసాయ పనులను అవలీలగా కష్టమును లెక్కచేయకుండా, వ్యవసాయంలో కుటుంబంతో సహా దిగి, తమవంతుగా దేశానికి ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ వ్యవసాయాన్ని దృష్టిలో ఉంచుకొని కొంతమంది ఇంజనీరింగ్ చేసిన మేధావులు వ్యవసాయాన్ని మరింత తక్కువ ఖర్చుతో ఎక్కువ పనులు చేసేందుకు నూతన టెక్నాలజీలతో పలు యంత్రాలను తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జైపూర్ నుండి పంట కోత నూతన యంత్రాన్ని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన రైతు కృష్ణాపురం రియాజ్ అహ్మద్ ఆన్లైన్ ద్వారా రూ .1,30,000కు కొనుగోలు చేశారు. ఆ నూతన యంత్రం గురించి ఆర్ బి డి -పవర్ రిపేర్ అనే కంపెనీ ద్వారా పలు ఉపయోగాలు ఉంటాయన్న ఉద్దేశంతో రైతు కొనుగోలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ పొలములో పంట వేసిన మొక్కజొన్న, రాగి, మడి, వరి, సప్ప, నూగులు, గోధుమ, గడ్డి తదితర పంటలను అతి సులభంగా ఆ యంత్రమే కట్ చేస్తుందని తెలిపారు. దీనివల్ల కేవలం ఒక ఎకరాకు, ఒక గంటలో, ఒక లీటర్ డీజిల్ తో ఈ పంట కోత సులభంగా చేయవచ్చునని, ఒకే ఒక వ్యక్తితో పనిచేసుకునే అవకాశం ఉందని తెలిపారు. తాను యూట్యూబ్ ద్వారా ఈ నూతన యంత్రం యొక్క పని విధానాన్ని తెలుసుకొని, అవగాహన చేసుకుని తన పొలంలో పనులు మొదలుపెట్టడం జరిగిందని తెలిపారు. అదే ఒక ఎకరాలో గల వివిధ పంటలను తొలగించడానికి కూలీలకు దాదాపుగా 6000 రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ నూతన యంత్రం వల్ల కేవలం ఒక వ్యక్తి, ఒక లీటర్ డీజిల్ ఉంటే చాలు, పంట కోత పనులు ఎంతో సులభతరంగా చేసుకునే అవకాశం వచ్చిందని తెలిపారు. ఇటువంటి యంత్రాలను ప్రతి రైతు కొనుగోలు చేయాలని తెలిపారు. రైతులకు అవసరమయ్యే అనగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పలు యంత్రాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అర్హత గల రైతులకు సబ్సిడీ ద్వారా అందించగలిగితే రైతు అభివృద్ధి బాటలో నడవడంతో పాటు తన కుటుంబాన్ని పూర్తిగా పోషించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ నూతన యంత్రం పని విధానం పట్ల పలువురు రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.