. ప్రశ్నపత్రాల లీకేజీ దారుణం
. ఎన్డీఏ ప్రభుత్వమే బాధ్యత వహించాలి
. ఎన్టీఏ పనితీరుపై విపక్ష నేతల మండిపాటు
న్యూదిల్లీ: యూజీసీనెట్ పరీక్ష రద్దు తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)పై ప్రతిపక్ష పార్టీల నాయకులు గురువారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ పరీక్షలకు హాజరయిన విద్యార్థుల భవిష్యత్ను ఎన్టీఏతో పాటు కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని విమర్శించారు. పరీక్షలపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలోని భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రానికి చెందిన జాతీయ సైబర్ నేరాల ముప్పు విశ్లేషణ విభాగం నుంచి కొంత సమాచారం అందుకున్న తర్వాత బుధవారం యూజీసీ
నెట్ పరీక్షను రద్దు చేసింది. కేంద్రంలోని మోదీ సర్కార్ ‘ప్రశ్నపత్రాల లీక్’ల ప్రభుత్వమని, ప్రతి సంవత్సరం ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చ’ పేరుతో ‘గొప్ప తమాషా’ నిర్వహిస్తారని, అయినప్పటికీ ఆయన ప్రభుత్వం ‘లీక్లు… అవకతవకలు’ లేకుండా ఇప్పటి వరకు ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేదని కాంగ్రెస్ విమర్శించింది. ప్రతి రోజు ప్రశ్నపత్రం లీక్ అవుతుందని, ఇది ఎలాంటి ‘పరీక్ష పే చర్చ’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం దేశ విద్య, నియామక వ్యవస్థను ఎలా నాశనం చేసిందో నీట్, యూజీసీనెట్, సీయూఈటీ (ఉమ్మడి అర్హత ప్రవేశ పరీక్ష)లో పేపర్ లీక్లు, మోసం, స్థూల అవకతవకలు ఇప్పుడు బట్టబయలయ్యాయని తెలిపారు. ప్రతిపక్షాలు పార్లమెంటులో సమాధానాలు కోరినప్పుడల్లా మోదీ ప్రభుత్వం కాలయాపన చేస్తూనే ఉందని, సాకులు చెబుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. యూజీసీ-నెట్ పరీక్ష రద్దుపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కేంద్రంపై మండిపడ్డారు. బీజేపీ పాలనలో పేపర్ మాఫియా ‘పరీక్షలను రిగ్గింగ్’ చేస్తోందని అన్నారు. పోలీసు నియామక పరీక్ష లీక్ అయితే, అది శాంతిభద్రతలపై ప్రభావం చూపుతుందని, నీట్ పరీక్షలో మోసం జరిగితే నిజాయతీపరులు వైద్యులు కాలేరని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అన్నారు. అలాగే యూజీసీ
నెట్ పరీక్ష రద్దు విద్యావ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో క్షుణ్ణంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో పరీక్షల ప్రక్రియ కుప్పకూలిందని, విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ సాకేత్ గోఖలే అన్నారు. ‘మన దేశంలో పరీక్షా ప్రక్రియ నిర్మాణం కుప్పకూలింది. పేపర్ లీక్లు, అక్రమాలు ఎక్కువయ్యాయి. పనికిరాని ఎన్టీఏ దానికి సహకరించింది’ అని గోఖలే ‘ఎక్స్’ పోస్ట్లో పేర్కొన్నారు. ‘నీట్ వైఫల్యం, విద్యార్థులు పరీక్ష రాసిన ఒక రోజు తర్వాత యూజీసీనెట్ రద్దయింది. మన విద్యార్థుల జీవితాలు, భవిష్యత్ ప్రతిరోజూ నాశనమవుతున్నాయి. మోదీ ప్రభుత్వం బాధ్యత వహించడానికి కూడా సిగ్గుపడదు’ అని ఆయన విమర్శించారు. ఎన్నికల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇద్దరినీ బర్తరఫ్ చేయాలని టీఎంసీ ఎంపీ డిమాండ్ చేశారు. ‘అసమర్థ విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు మనం కొద్ది రోజుల క్రితం రైలు ప్రమాదం చూశాం. వారిని బర్తరఫ్ చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో తనకు ఎదురైన అవమానాల నుంచి మోదీ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను అపహాస్యం చేస్తోందని సీపీఎం ‘ఎక్స్’ పోస్ట్లో పేర్కొంది. ‘మొదట సీయూఈటీలో వైరుధ్యాలు చోటుచేసుకున్నాయి. తరువాత నీట్ కుంభకోణం. ఇప్పుడు యూజీసీ
నెట్ రద్దయింది! బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా అపహాస్యం చేసింది’ అని తెలిపింది. నీట్ పరీక్షను కూడా రద్దు చేయాలని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎంపీ మనోజ్ రaా అన్నారు. ‘మీరు యూజీసీనెట్ను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ పరీక్షలో అవకతవకలకు తగినంత రుజువు ఉన్నందున మీరు ఇప్పుడు నీట్ను రద్దు చేయాలి. ఎన్టీఏ ఒక మోసం అని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ఆయన తెలిపారు. యూజీసీ
నెట్ అనేది భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, పీహెచ్డీలో ప్రవేశానికి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డుకు భారత జాతీయుల అర్హతను నిర్ణయించడానికి ఒక పరీక్ష. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రిత్వ శాఖ యూజీసీనెట్ను రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నీట్ అంశం ఇప్పుడు సుప్రీం కోర్టులో ఉంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎన్టీఏ ద్వారా నీట్
యూజీ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. కాగా, సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ యూజీసీ-నెట్ పరీక్షలో అడిగే ప్రశ్నలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, విద్యారంగాన్ని ‘కాషాయీకరణ’ చేస్తున్నారని విమర్శించారు. ‘ఎప్పుడైతే నీట్ నుంచి నెట్ వరకు కుప్పకూలిందో… కాషాయీకరణ (ప్రశ్నలు) ఎలా జరుగుతుందో చూడండి. ఒక విద్యార్థికి నెట్ ప్రశ్నలు… అయోధ్య ప్రాణప్రతిష్ఠ తేదీ, మన తర్వాతి తరాన్ని ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నాం?’ అని పేర్కొన్నారు. బ్రిట్టాస్ యూజీసీ`నెట్కు చెందిన కొన్ని చిత్రాలను పంచుకున్నారు. ఇది రామ మందిరానికి ప్రాణప్రతిష్ఠ తేదీని, రామాయణం, మహాభారతం, ఇతర మత గ్రంథాలకు సంబంధించిన ఇతర ప్రశ్నలను అడిగారు.