. ఐదువేల ఎకరాల్లో రూ.70 వేల కోట్లతో ఏర్పాటు
. మూడునెలల్లో ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక
. సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ చైర్మన్ భేటీ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కారిడర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బుధవారం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) చైర్మన్, ఎండీ కృష్ణకుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమైన సీఎం.. ఈ భేటీకి సంబంధించిన వివరాలను ‘ఎక్స్’ వేదికగా వెల్లడిరచారు. ‘‘దేశానికి తూర్పు తీరంగా ఉన్న ఏపీలో గణనీయమైన పెట్రోకెమికల్ సామర్థ్యం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం 5వేల ఎకరాల భూమి అవసరమవుతుంది. అందుకే 90 రోజుల్లో ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై వివరణాత్మక ప్రణాళికతో కూడిన సమగ్ర నివేదిక ఇవ్వాలని సంస్థ ప్రతినిధుల్ని కోరాను. ఇబ్బంది లేని పద్ధతిలో ఆ సంస్థకు సౌకర్యాలు కల్పించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ’’ చంద్రబాబు ట్వీట్ చేశారు. తొలుత సచివాలయంలో బీపీసీఎల్, విన్ ఫాస్ట్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బీపీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు రూ. 60 నుంచి 70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు తన దిల్లీ పర్యటన సందర్భంలో కేంద్ర పెద్దలతో బీపీసీఎల్ పెట్టుబడులపై చర్చించారు. వాటికి కొనసాగింపుగా బుధవారం బీపీసీఎల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 4-5 వేల ఎకరాలు అవసరం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అససరమైన భూములు కేటాయిస్తామని… అయితే 90 రోజుల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన పూర్తి ప్రణాళికతో రావాలని కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. అక్టోబర్ నాటికి ఫీజిబిలిటీ రిపోర్ట్ తో వస్తామని బీపీసీఎల్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం విన్ ఫాస్ట్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. విన్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వియత్నాంలో పేరున్న సంస్థ. ఈ సంస్థ సీఈవో పామ్ సాన్ చౌ తో పాటు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు. ఈవీ, బ్యాటరీ తయారీ ప్లాంట్ ను ఏపీలో నెలకొల్పాలని చంద్రబాబు వారిని కోరారు. ప్లాంట్ కు అవసరమైన భూమి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలా సహకరిస్తామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అంతకు ముందు బీపీసీఎల్, విన్ఫాస్ట్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి విందు ఇచ్చారు.