ఏఓ వరప్రసాద్
విశాలాంధ్ర – పెద్దకడబూరు : కౌలు రైతులు పొందే గుర్తింపు కార్డుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే రైతు సంక్షేమ పథకాలన్నీ వర్తిస్తాయని మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ సూచించారు. మంగళవారం పెద్దకడబూరు మండలంలోని హెచ్ మురవణిలోని రైతు సేవా కేంద్రంలో కౌలు రైతు గుర్తింపు కార్డుల ప్రాముఖ్యతను కౌలు రైతు సమావేశంలో ఏఓ వరప్రసాద్ వివరించారు. ఈ సమావేశానికి వీఆర్వో విక్రమ్ రెడ్డి, వ్యవసాయ సిబ్బంది వెంకటేష్ నాయక్, మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ భూ యజమాని తన పొలం సాగు చేసుకోనప్పుడు కౌలుదారులకు కౌలు పత్రం పొందటానికి అవసరమయ్యే అంగీకార పత్రం మీద సంతకం చెయ్యటం వలన ఎటువంటి భూ యజమాని హక్కులు కోల్పోడని నిరభ్యంతరంగా అంగీకారం తెలుపవచ్చునన్నారు. కౌలుపత్రం పొందిన కౌలు రైతులకు మాత్రమే ప్రభుత్వం అందించు పథకాలన్ని వర్తిస్తాయని, అట్టివారికి మాత్రమే పంటనష్టం, ఇన్సూరెన్సు మొదలగు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. కౌలు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి సంబంధిత రైతు సేవా కేంద్ర సిబ్బందిని, గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సత్యగౌడ్, రైతులు పాల్గొన్నారు.