విశాలాంధ్ర-తాడిపత్రి: మండలంలోని కోమలి గ్రామంలోని త్రాగునీటి ట్యాంకును గురువారము ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఐజయ్య పంచాయతీ కార్యదర్శి ప్రతాప్ రాజు పరిశీలించినట్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు సుంకర నాగేంద్ర చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వచ్చినప్పటి నుండి తమ గ్రామంలో నీటి ట్యాంకుకు నీరు నిల్వ ఉంచకపోగా పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో దాదాపు ఐదు సంవత్సరాల నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలుగు దేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే కోమలి గ్రామంలో నీటి సమస్య ఉందని నీటి ట్యాంకు మరమ్మతులు చేయించి, నీటి కొరత తీర్చాలని పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసాము. అలాగే నీటి ట్యాంకు మరమ్మత్తులకు తాము ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తామని అధికారులకు భరోసా కల్పించాము. దీంతో అధికారులు స్పందించి గురువారం గ్రామానికి వచ్చి నీటి ట్యాంకులు పరిశీలించి దీనిని వెంటనే మరమ్మతు చేయించి నీటి ట్యాంకులో నీరు నిల్వ ఉండేటట్లు ఏర్పాటు చేసి ప్రజలకు ట్యాంకు సద్వినియోగంలోకి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోమలి గ్రామ పాఠశాల చైర్మన్ సుంకర పెద్దిరాజు, గ్రామ పెద్దలు హనుమంత రెడ్డి, కులశేఖర్ రెడ్డి, సచివాలయం సెక్రటరీ శ్రీరామ్ ఉప సర్పంచ్ ప్రవీణ శ్రీనివాసులు, నాగరాజు, రామాంజనేయులు ఫీల్డ్ అసిస్టెంట్ సంఘవి పాల్గొన్నారు.