ఏపీ క్యాబినెట్ భేటీ 7వ తేదీకి వాయిదా పడింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం 11 గంటలకు జరగాల్సి ఉంది. దాన్ని 7వ తేదీకి వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్లో చర్చించాల్సిన ప్రతిపాదనలను 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా సాధారణ పరిపాలన శాఖకు పంపాలని సీఎస్ నీరభ్కుమార్ వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు. కాగా, ఈ నెల 2వతేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశం 7వ తేదీన జరుగుతుందని నూతనంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.మరోవైపు చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం పర్యటనకు వెళతారు.. అలాగే శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వరుస పర్యటనల కారణంగానే కేబినెట్ భేటీని వాయిదా వేశారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు పంపాలని కోరారు.