బదిలీ అయిన ఉద్యోగులు వెంటనే జాయిన్ కావాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి గురువారం ఫ్రీహోల్డ్ చేయబడిన మరియు రిజిస్టర్ చేయబడిన భూములపై సమగ్ర వివరణాత్మక విచారణ, రెవెన్యూ (భూములు) శాఖ 22-ఎ నుండి ఫ్రీహోల్డ్/తొలగించబడిన భూముల రీ-వెరిఫికేషన్ ప్రక్రియ,”ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డిఓ, తహసిల్దార్, డివిజనల్ సర్వేయర్లు, జిల్లా రిజిస్టర్, ఎలక్షన్ సెల్ సిబ్బంది, ల్యాండ్ సెక్షన్ సిబ్బంది తో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో 34.485.89 ఎకరాల భూమికి సంబంధించి అక్టోబర్ 5వ తేదీలోపు అసైన్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ పరిశీలన ప్రక్రియను పూర్తిచేసి సంబంధించిన రిపోర్టులను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఫ్రీ హోల్డ్ అయి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ జరిగిన 178.73 ఎకరాల భూమికి సంబంధించి పునఃపరిశీలన ప్రక్రియ ఇప్పటివరకు పూర్తయిందని తెలిపారు. జిల్లాలో పునఃపరిశీలన ప్రక్రియను సకాలంలో పూర్తిచేయాలని, ఏదైనా కారణాలు, ఇబ్బందులు ఉంటే తెలపాలని సూచించారు. కుందుర్పి, పామిడి మండలాలు ఈ ప్రక్రియలో చాలా వెనకబడి ఉన్నాయని పేర్కొన్నారు. అసైన్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ పరిశీలన ప్రక్రియను మొదటి ప్రాధాన్యతగా చూడాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్ ) కు సంబంధించి కలెక్టరేట్, ప్రతి ఆర్డీఓ కార్యాలయం, తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజలకు అవసరమైన 100 ముఖ్యమైన సేవలకు సంబంధించిన బోర్డులను ప్రదర్శించాలన్నారు. అలాగే నగరపాలక సంస్థ కార్పొరేషన్ కార్యాలయంలో, మున్సిపాలిటీ కార్యాలయాలలో ముఖ్యమైన సేవల వివరాలు, పరిష్కరించే బోర్డులను ప్రదర్శించాలన్నారు. కార్యాలయాల్లో 100 సేవలపై ఏర్పాటు చేసిన బోర్డుల ఫోటోలను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపాలని తెలిపారు. గుంతకల్ ఆర్డీవో కార్యాలయంలో పిజిఆర్ఎస్ ఫిర్యాదులు తక్కువగా ఉన్నాయని, కానీ రీఓపెన్ కేసులు ఎక్కువగా ఉన్నాయని, ఇవి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సర్వే కి సంబంధించి రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుండి దిశ, నిర్దేశాలు వస్తాయని తెలిపారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, విఆర్ఓ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర సిబ్బంది బదిలీలు కావడం జరిగిందని, పింఛన్ పంపిణీ కార్యక్రమం ఉన్నందువలన ఈరోజు అందరూ విధుల్లో చేరే విధంగా చూడాలన్నారు. బదిలీలకు సంబంధించి వ్యక్తిగత, గ్రీవెన్స్, అనారోగ్య కారణాలు సంబంధించి మీరిచ్చిన అర్జీలను పరిశీలించి వాటిలో జెన్యూన్ గా ఉన్న వాటిని ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు బదిలీలు చేయడం జరిగిందని తెలిపారు. దీని తర్వాత ఎటువంటి బదిలీలకు ఆస్కారం ఉండదని తెలిపారు. కాబట్టి మీకు బదిలీ చేసిన ప్రదేశాలలో వెంటనే జాయిన్ కావాలని తెలిపారు. మీరు వెంటనే కార్యాలయంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు పథకాలు, పనులను అమలయ్యే విధంగా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.