ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి మళ్లీ వరద వస్తోంది. నిన్నటి నుంచే వరద నీరు పెరుగుతుందని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజికి సోమవారం 45వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో అంతే మొత్తంలో నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు ఏఈ దినేశ్ తెలిపారు. వరద వస్తున్న నేపథ్యంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. మత్స్య కారులు ఎవరూ నదిలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇటీవల వరదలకు విజయవాడ పట్టణం అతలాకుతలం అవ్వడంతో మళ్లీ వరద, భారీ వర్షాల హెచ్చరికలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శ్రీశైలం బ్యారేజికి మంగళవారం ఉదయం 1,27,548 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా, 77,821 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.