-అనంతపురం రేంజ్ డి.ఐ.జి డాక్టర్ షిమోసి జిల్లా ఎస్పీ పి.జగదీష్ సంయుక్త పిలుపు
జిల్లా ప్రశాంతత, ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసుల విధులు
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
విశాలాంధ్ర -అనంతపురం : సమాజ భద్రత, రక్షణల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితం అవుదామని అనంతపురం రేంజ్ డి.ఐ.జి డాక్టర్ షిమోసి , జిల్లా ఎస్పీ పి.జగదీష్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సాయుధ బలగాల నుండీ డి.ఐ.జి, ఎస్పీలు గౌరవ వందనం స్వీకరించి అనంతరం ప్రసంగించారు.
అనంతపురం రేంజ్ డి.ఐ.జి డాక్టర్ షిమోసి మాట్లాడుతూ…
విధి నిర్వహణలో ఎన్నో సేవలు అందిస్తూ ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమర వీరులను స్మరించుకుంటూ పోలీసు అమరవీరుల దినం జరుపుకుంటున్నాము. దేశ అంతర్గత భద్రతలో పోలీసులు పాత్ర కీలకమైనది. బాధ్యతాయుతమైనది. శాంతి భద్రతల పరిరక్షణ, సమాజ ప్రశాంతత కోసం 24×7 శ్రమిస్తున్నారు. న్యాయశాఖ, ఇతర ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పోలీసులు పని చేస్తున్నారు. నేరాల నియంత్రణ, ముద్దాయిలకు శిక్షలు పడేలా కృషి చేస్తున్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన కుటుంబాలకు కారుణ్య నియమాకాలు, అందాల్సిన బెన్ఫిట్స్ అందజేయడం జరుగుతోంది. ప్రజలకు, సమాజానికి సేవ చేయడానికి యూనిఫాం సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతోంది. కానిస్టేబుల్ నుండీ ఐ.పి.ఎస్ అధికారుల వరకు ఉద్యోగంలో చేరే ముందు అందరూ ఒకే తరహా ప్రతిజ్ఞ చేస్తారు. ఆ ప్రతిజ్ఞ సారాంశానికి అనుగుణంగా విధుల్లో నిరంతరం ప్రజలు, సమాజం కోస పని చేద్దామని డి.ఐ.జి పిలుపునిచ్చారు.
జిల్లా ఎస్పీ పి.జగదీష్ మాట్లాడుతూ…
1959 సంవత్సరం అక్టోబర్ నెల 21 వ తేదీన లడక్ ప్రాంతంలో మన దేశ మిలటరీ బలగాలకు చైనా దళాలకు భీకర యుద్ధం జరిగింది. ఆ సందర్భంగా మన వీర జవానులు 10 మంది మరణించారు. అప్పటి నుండి అమరులైన వారి జ్ఞాపకార్థం పోలీసు అమరవీరుల వారోత్సవాలు మరియు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోన్న విషయం మీకు వివరించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. జిల్లాలో కూడా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము.
ఈ వారోత్సవాలను ఈ ఏడాది అక్టోబర్ 21 ప్రారంభించి అక్టోబర్ 31 వరకు జరుపుకుంటాము. భావిభావి భారత పౌరులైన విద్యార్థినీ విద్యార్థులకు, ప్రజలకు పోలీసు విధుల పట్ల అవగాహన కల్పించడం, విధి నిర్వహణలో పోలీసు వినియోగించే ఆయుధాలు, ఇతర సామగ్రి గురించి వారికి వివరించి ఆసక్తి పెంపొందిపచేస్తు…పోలీసు నిబద్దత, కార్యధీక్షత పట్ల చైతన్యం చేస్తూ… పోలీసు అమరవీరుల స్పూర్తితో పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమాన్ని సమీక్షించి వారి శ్రేయస్సు గురించి కృషి చేస్తున్నాము. ఎన్నో ప్రజా సేవా కార్యక్రమాలను జిల్లా అంతటా చేపట్టడం జరుగుతుంది.
మన ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు దళాల పాత్ర చాలా కీలకమైనది. శాంతి భద్రతలు పరిరక్షించడం తో పాటు తీవ్రవాదం, ఉగ్రవాదం, మత ఛందస్సవాదులు, అసాంఘిక శక్తుల నుండి సామాన్య ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు ప్రాణాలను త్యాగం చేస్తూనే ఉన్నారు. ప్రతి పోలీసు మన దేశానికి వెన్నెముక లాంటి వాడు. దేశ అంతర్గత శత్రువు, బహిరంగ శత్రువులు నుండి సామాన్య మానవులను కాపాడటంలో త్యాగాలకు సైతం సిద్దం అవుతున్నారు.
ప్రతి మనిషి తను పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ప్రతి కదలికలో అతనిని కాపాడుటకు పోలీసులు చేయు కృషి, త్యాగం స్పష్టంగా కనబడుతుంది. చిన్న చిన్న సమస్యల నుండి ప్రకృతి వైపరీత్యాల వరకు పోలీసు సేవలు తప్పనిసరి అవుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా… అనగా బహిరంగ సభ కానీ, పరీక్షలు కానీ, ఎన్నికలు కానీ, ఏ ఇతర ర్యాలీలు తదితర సందర్బాలలో పోలీసుల సహకారం లేకుండా సాఫీగా నిర్వహించడం అసాధ్యంగా మారుతుంది.
ఏ దేశమైనా, రాష్ట్రమైన ప్రశాంతంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. అభివృద్ధి జరగాలంటే సమాజం ప్రశాంతంగా ఉండాలి. సమాజం ప్రశాంతంగా ఉండాలంటే పోలీసు సేవలు తప్పనిసరి ఉండాలి. అందుకే పోలీసులు కూడా సమాజంలో భాగమని అందరూ భావించాలి. అంతేకాకుండా ప్రజలు కూడా పోలీసులకు సహకారాలు అందించాలి. చట్టవ్యతిరేక, అసాంఘిక, అరాచక శక్తులు నుండి మన దేశాన్ని రక్షించుకోవాలి అంటే తపనిసరిగా పోలీసులకు సహకరించాలి.
దీంతో పాటు రక్తదానం, తదితర సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నాము.
విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు కుటుంబాలతో సమావేశం ఏర్పాటు చేసి వారి ఆర్థిక, మానసిక పరిస్థితులను తెలుసుకుని పోలీసుశాఖ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేయనున్నాము.
ఇవే కాకుండా సాధారణ విధులలో భాగంగా జిల్లా ప్రజల ప్రశాంత జీవనం, శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తుంది. జిల్లా యంత్రాంగంతో కలిసి అన్ని వర్గాల ప్రజల సహకారం తీసుకుంటూ ముందుకెళ్తున్నాము. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కృషి చేసి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నము. రోడ్డు భద్రతపై అవగాహన తీసుకొస్తున్నాము. మహిళల భద్రతను కీలకంగా భావించి ఆదిశగా పని చేస్తున్నాము. మహిళలపై జరిగే నేరాల కట్టడికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాము. మహిళా పోలీసు సిబ్బంది ద్వారా బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాము. ఎడబాటులో ఉన్న సంసరాలను చట్ట పరిధిలో ఒక్కటి చేస్తున్నాము. ఎస్ సి,ఎస్ టి వర్గాల సమస్యల పరిష్కారం కోసం త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నాం. ఫ్యాక్షన్ కట్టడి, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అడుకట్టకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాము. సాంకేతిక పరిజ్ఞానం జోడించి సీసీ కెమెరాల ఏర్పాటు, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, Dail 100 , సైబర్ సెల్ , తదితరాలతో ప్రజలకు సేవలందిస్తున్నాము.
ఈ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ ప్రజలకు తెలిపేది ఒక్కటే….. పోలీసులు కూడా మీ కుటుంబంలో ఒకరిగా బావించండి. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్న పోలీసులుగా మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము. మా పై విశ్వాసం పెంచుకోండి. ప్రజా సేవయే మా పరమావదిగా, ప్రజలు ప్రశాంత జీవనం గడపటం మా సంకల్పం.
ప్రజలందరూ ఏదైనా పండుగలు లేదా ఇతర శుభకార్యాక్రమాలు తమ కుటుంబ సభ్యులతో జరుపుకుంటుoటే పోలిసులు మాత్రం తమ కుటుంబాలకు దూరంగా ప్రజలకు రక్షణ కల్పించడానికి, ప్రజల కోసం విధులు నిర్వహిస్తున్నారు. అహర్నిశలు కష్టపడుతున్నారు. కష్టాలలో ప్రజల వెంట ఉండి ఈ పోలీసు ఉద్యోగాన్ని మేము వరంగా భావిస్తున్నాము. దేశ రక్షణ, భద్రత కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమైనవి. దేశవ్యాప్తంగా 2023-2024 సంవత్సరంలో అసాంఘిక శక్తులతో పోరాడి అన్ని పోలీసు విభాగాలకు సంబంధించిన 214 మంది పోలీసులు వారి ప్రాణాలను బలిదానం ఇచ్చారు. అందులో మన రాష్ట్రంలో కూడా ఇద్దరు పోలీసులు ఉన్నారు. మన జిల్లాలో కూడా వివిధ కారణాలతో విధి నిర్వహణలో చనిపోయిన 12 మందిలో 09 మంది పోలీసులు, ముగ్గురు హోంగార్డులు ఉన్నారు. వీరందరికీ పేరు పేరున, జోహార్లు అర్పిస్తున్నాను. వీరి త్యాగాలు మరువలేనివి, కుటుంబ సభ్యులు దైర్యంగా ముందుకు సాగాలని కోరుతున్నాము. రాబోవు రోజులో కూడా అమరవీరులను ఇలానే స్మరిస్తూ ముందుకు సాగుదాం…
జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ మాట్లాడుతూ…
1959 లో మన దేశ సరిహద్ధుల్లో చైనా బలగాలకు మన దేశ బలగాలకు యుద్ధం జరిగింది. ఆ వీరోచిత పోరాటంలో మన సిబ్బంది అసువులు బాసారు. ఆ పోలీసు అమరులను స్మరించుకుంటూ ప్రతీ ఏటా ఈ రోజు పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్నాము. పోలీసు సేవలు మరువలేనివి. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనివి. శాంతిభద్రతల పరిరక్షణ వీరి ప్రధాన కర్తవ్యం. పోలీసుశాఖ క్రమశిక్షణకు మారు పేరు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపడం… ప్రజల శ్రేయస్సు కోసం సేవలు అందిస్తుండటం ముదావహం. సమాజంలో పోలీసుల పాత్ర కీలకం. దేశ సరిహద్దుల్లో పోరాడే వారు సైనికులయితే దేశ అంతర్గత శత్రువులతో పోరాడి ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడే వారే పోలీసులు. పగలు, రేయి తేడా లేకుండా… కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ ప్రాణాలను ఫణంగా పెడుతున్న పోలీసులకు నా సెల్యూట్ అని తెలియజేశారు.
జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ మాట్లాడుతూ… పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం. ఆనాడు భక్త ప్రహ్లాదుడు వేడుకుంటే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఈనాడు… ప్రజలు పిలిస్తే చాలు పోలీసులు అక్కడ వాలి బాధిత ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆనాడు దేవుడు ఉద్భవించినట్లే నేడు ప్రజలు, సమాజం కోసం పోలీసు వ్యవస్థ ఏర్పాటై ప్రజల బాధలను తీర్చుతున్నారు. కరోనాలో కూడా మన దేశంలో అన్ని రకాల యూనిఫాం ధరించిన పోలీసులు మంచి సేవలు అందించడ వల్లే చైనా కంటే మన దేశ జనాభా ముందంజలో ఉందన్నారు. వి.ఐ.పి ల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, నేరాల నియంత్రణలో పోలీసుల పాత్ర అమోఘం. సమాజం, ప్రజల శ్రేయస్సు కోస అహర్నిశలు పని చేస్తూ ప్రాణాలు సైతం ఫణంగా పెడుతున్న పోలీసులకు ఇచ్చే పరిహారం రెట్టింపు చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.
అనంతపురం రేంజ్ డి.ఐ.జి, జిల్లా ఎస్పీలు మరియు ప్రముఖులు, అధికారులు పోలీసు అమరవీరుల స్థూపం వద్ద అమర పోలీసులను స్మరించుకుంటూ పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
దేశ రక్షణ, భద్రత కోసం విధి నిర్వహణలో అశువులుబాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమైన దేశవ్యాప్తంగా 2023-2024 సంవత్సరంలో అసాంఘిక శక్తులతో పోరాడి 214 మంది పోలిసులు వారి ప్రాణాలను బలిదానం ఇచ్చారు. అందులో మన రాష్ట్రం లో ఇద్దరు ఉన్నారు. జిల్లాలో కూడా అనారోగ్యం, రోడ్డు ప్రమాదం, తదితర కారణాలతో 09 మంది పోలీసులు, ముగ్గురు హోంగార్డులు చనిపోయారు. వీరందరికీ పేరు పేరున, జోహార్లు అర్పించారు. వీరి త్యాగాలు మరువలేనివి, కుటుంబ సభ్యులు దైర్యంగా ముందుకు సాగాలని కోరారు. రాబోవు రోజులో కూడా అమరవీరులను ఇలానే స్మరిస్తూ ముందుకు సాగుదామని డిఐజి, ఎస్పీలు పిలుపునిచ్చారు.
కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయామని అధైర్య పడకండి… మీకు అండగా పోలీసుశాఖ ఉంటుందని డి.ఐ.జి, ఎస్పీలు పోలీసు అమర వీరుల కుటుంబాలకు భరోసానిచ్చారు. పోలీసు అమర వీరుల కుటుంబాలలో ఏవైనా సమస్యలున్నా …. ప్రభుత్వ ప్రయోజనాలు అందకపోయినా తమ దృష్టికి తీసుకురావాలని డిఐజి, ఎస్పీలు తెలియజేశారు. అనంతరం…గత ఏడాది రోడ్డు ప్రమాదాలు, తదితర కారణాలతో చనిపోయిన 12 మంది పోలీసులు, హోంగార్డుల కుటుంబాలకు కలిపి మొత్తం రూ. 1.05 లక్షలను చెక్కుల రూపంలో ఆయా కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈకార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జడ్పీ ఛైర్మేన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీలు వై.శివరామిరెడ్డి, మంగమ్మ, అదనపు ఎస్పీ డి.వి.రమణమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఈ.బి.దేవి, డీఎస్పీలు వి.శ్రీనివాసరావు, టి.వెంకటేశ్వర్లు, ఎస్ మహబూబ్ బాషా, సి.ఐ లు ధరణీకిశోర్ , క్రాంతికుమార్, కనుమూరి సాయినాథ్, హేమంత్ కుమార్, కరుణాకర్, ఇస్మాయిల్, ప్రతాప్ రెడ్డి, దేవానంద్, రఘు ప్రసాద్, ఖాదర్ భీ, ఆర్ ఐ లు రెడ్డెప్పరెడ్డి, రాముడు, మధు, లీగల్ అడ్వైజర్ విష్ణువర్ధన్ రెడ్డి, డిపిఓ ఏ.ఒ శంకర్, బి.సూపరింటెండెంట్ ప్రసాద్, ఎస్పీ సి.సి ఆంజనేయ ప్రసాద్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ ఎస్ ఐ జాఫర్ , జిల్లా కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, శ్రీనివాసుల నాయుడు, ఆనంద్, లక్ష్మినారాయణ, పలువురు ఎస్సైలు, ఆర్ ఎస్ ఐ లు, రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం నాయకులు, మరియు అమర పోలీసు కుటుంబాలు, తదితరులు పాల్గొన్నారు.