విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెన పవన్ కల్యాణ్కు హైదరాబాద్ సివిల్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై పవన్ కల్యాణ్ ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో న్యాయవాది ఇమ్మనేని రామారావు పిటీషన్ దాఖలు చేశారు. శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతుమాంసంతో చేసిన నెయ్యిని కలిపారని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని పిటీషన్లో పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ తన హోదా మరచి వివాదాస్పద వాఖ్యలు చేశారని, ఇంటర్నెట్లో ఆయన మాట్లాడిన వీడియోలు డిలీట్ చేయాలని న్యాయవాది తన పిటిషన్లో కోరారు. తిరుపతి లడ్డూ వివాదంలో సమగ్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇప్పటికే స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, మరోసారి తిరుపతి ప్రసాదంపై పవన్ కల్యాణ్ ఇలాంటి వాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని రామారావు తన పిటిషన్లో కోర్టును కోరారు. దీనిపై స్పందించిన సిటీ సివిల్ కోర్టు పవన్ కల్యాణ్కు సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అలాగే తెలంగాణ సీఎస్కు సైతం కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఆ కేసును క్వాష్ చేయండి: అల్లు అర్జున్ పిటీషన్
రాష్ట్ర ఉన్నతన్యాయస్థానంలో సినీనటుడు అల్లు అర్జున్ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన కోరారు. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్న సమయంలో, అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.