మహారాష్ట్రలో 210 స్థానాల్లో పోటీపై ఎంవీఏలో కుదిరిన అంగీకారం: సంజయ్ రౌత్ వెల్లడి
న్యూదిల్లీ : మహారాష్ట్రలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమిలో సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చింది. సీట్ల పంపకాలపై ఎంవీఏ కూటమిలో విభేదాలు వచ్చినట్లు వార్తలొచ్చిన సంగతి విదితమే. శివసేన(యూబీటీ) ఒంటరిగా పోటీ చేస్తుందని పుకార్లు షికార్లు చేశాయి. కాగా వదంతులకు తెరదించుతూ ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్తో సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు గాను 210 స్థానాల్లో పోటీపై మహా వికాస్ అఘాడి ఏకాభిప్రాయానికి వచ్చిందని… ఈ పురోగతి ప్రధాన విజయంగా భావిస్తున్నట్లు రౌత్ ప్రకటించారు. మహారాష్ట్రను దోచుకుంటున్న శక్తులను ఓడిరచడమే ఇండియా ఐక్యసంఘటన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ‘‘210 సీట్లపై ఏకాభిప్రాయానికి వచ్చాం. ఇది ఒక ముఖ్యమైన విజయం. ఉమ్మడి శక్తిగా ఎన్నికల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మహారాష్ట్రను లూటీ చేసే శక్తులను ఓడిస్తాము.’’ అని రాజ్యసభ ఎంపీ, శివసేనకు కీలక వ్యూహకర్త అయిన సంజయ్ రౌత్ విలేకరులతో అన్నారు. ఎంవీఏలో శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) కాంగ్రెస్ ఉన్నాయి. మరోవైపు పాలక మహాయుతిలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూటమి ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 26తో ముగుస్తుంది. ఇండియా ఐక్యసంఘటన-ఎన్డీఏ కూటమి తలపడు తున్నాయి. నువ్వానేనా? అన్నట్టుగా దీటైన అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారు. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
ఈసీ సాయంతో బీజేపీ ఓటర్ల జాబితా మోసం
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలు శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో సంజయ్ రౌత్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. ముంబైలో విలేకరుల సమావేశంలో రౌత్ మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ ఎన్నికల మోసానికి పాల్పడుతోందని తెలిపారు. రౌత్ ప్రకారం, బీజేపీ పోటీ చేస్తున్న ప్రతి నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కి మద్దతు ఇచ్చిన సుమారు 10 వేల మంది ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించి, వారి స్థానంలో బోగస్ ఓటర్లతో భర్తీ చేస్తున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్లో ఓటరు జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని, హర్యానాలో కూడా ప్రయత్నాలు జరిగాయని, మహారాష్ట్రలో బీజేపీ ఎన్నికల్లో ఓడిపోబోతోందని, అందుకే ఈసీ సాయంతో వారు ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. బీజేపీ పోటీ చేస్తున్న ప్రతి నియోజకవర్గంలోనూ లోక్సభలో ఎంవీఏకు ఓటు వేసిన 10,000 మంది ఓటర్లను తొలగించి, వారి స్థానంలో 10,000 మంది బోగస్ ఓటర్లతో మన గెలుపు అవకాశాలను తగ్గించారని తెలిపారు.