. పోలీసుల సంక్షేమానికి ఏటా రూ.20 కోట్లు
. త్వరలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
. పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : సమైక్యాంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత ఏపీ పోలీసులు దేశంలో ఓ ప్రత్యేక బ్రాండ్ ఉన్న పోలీసులుగా గుర్తింపు సాధించారని… తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అందరూ కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. నక్సలిజాన్ని, కుల,మత విద్వేషాలు, ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన ఘనత ఏపీ పోలీసులకే దక్కిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో జీరో క్రైమ్ ఉండాలని, ఎవరైనా నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలని, దానికోసం ప్రతి ఒక్కరూ సమర్థంగా పనిచేయాలని కోరారు. శాంతి, భద్రతలు అనేవి ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమని, అలాగే పోలీసు సంక్షేమం అనేది ఈ ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల కంటే పోలీస్ శాఖ అత్యంత కీలకమన్నారు. సమాజ హితం కోసం చేసే కృషిలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారని, ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు రాత్రి పగలూ కష్టపడేది పోలీసులేనని కొనియాడారు. సంఘ విద్రోహ శక్తులు అనేక రూపాల్లో సమాజానికి సవాళ్లు విసిరే సందర్భంలో వాటిని ఎదుర్కొంటూ ప్రజలను కాపాడటంలో పోలీసుల కృషి వెలకట్టలేనిదన్నారు. ఇటీవల విజయవాడ వరదల సమయంలో ప్రజలను కాపాడటంలో విశేష కృషి చేసిన పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు, ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు సమయంలో పోలీసులు బాగా పనిచేశారని, శాంతి భద్రతలను కాపాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా దర్శనం చేసుకునేలా కృషిచేశారని ప్రశంసించారు.
పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తెచ్చాం
2014 తర్వాత పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామని, అవసరం మేరకు వాహనాలు, పరికరాలు, సాంకేతిక సౌకర్యాలను అందుబాటులో ఉంచామన్నారు. ఏపీ పోలీస్ అంటే దేశంలోనే మోడల్ పోలీస్ గా ఉండాలనే ఉద్దేశంతో వివిధ చర్యలు తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో కక్షసాధింపు, రాజకీయ వేధింపుల కోసం పోలీసులను తయారుచేసే పరిస్థితికి వచ్చారని, అలాంటి పనులకు ప్రతిష్ఠాత్మక ఐపీఎస్ వ్యవస్థను ఉపయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులంటే రాగద్వేషాలకు అతీతంగా పనిచేసే వ్యవస్థ అన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి రక్షణ కోసం రూ. 12 కోట్లతో కంచె వేసుకొన్నారని, ఫింగర్ ప్రింటింగ్ ఐడెంటిఫికేషన్ వంటి వ్యవస్థ నిర్వహణ కోసం మాత్రం అయిదేళ్లలో రూ. 10 కోట్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు. మరోవైపు సర్వే రాళ్లపైన తన బొమ్మ కోసం రూ. 700 కోట్లు తగలేసిన వ్యక్తి సీసీటీవీ కెమెరాల కోసం రూ. 700 కోట్లు ఇవ్వలేదన్నారు. ఈ మొత్తం ఇచ్చుంటే ఈరోజు అఘాయిత్యాలు జరిగే పరిస్థితి ఉండేది కాదన్నారు. విశాఖలో రూ. 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పోలీసులకు సరెండర్ లీవ్లు ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రభుత్వంపై అనేక సవాళ్లు ఉన్నాయని చెబుతూ… గత ప్రభుత్వం తెచ్చిన రూ. 10,50,000 కోట ్ల అప్పుకు వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు.
పోలీసులకు సవాల్గా మారిన సైబర్ నేరాలు
గణనీయంగా పెరుగుతున్న సైబర్ నేరాలు పోలీస్ శాఖకు సవాల్గా మారాయని చంద్రబాబు అన్నారు. నేరగాళ్ల కంటే మెరుగ్గా మనం టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటేనే శాంతిభద్రతలను కాపాడగలమన్నారు. కొందరు రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడుతూ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ముసుగు తీసి శాంతిభద్రతలను కాపాడే విషయంలో పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీస్ సంక్షేమానికి ప్రతి ఏటా 20కోట్లు కేటాయిస్తామని, అలాగే త్వరలో 6,100 కానిస్టేబుల్స్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ పోలీసుల త్యాగాల వల్లే సమాజం ప్రశాంతంగా ఉంటుందన్నారు.
నవతరానికి ఉత్సాహాన్ని, స్ఫూర్తిని, ప్రేరణను రగిలించడమే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ నిర్వహణ ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ పోలీస్ సంస్మరణ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో శాంతి, భద్రతలు కాపాడటమే పోలీసు ప్రధమ కర్తవ్యమని, కుటుంబ సంక్షేమం కంటే సమాజ రక్షణే లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఐజీ ఇంటెలిజెన్స్ సీహెచ్. శ్రీకాంత్, పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది, పోలీసు అమరవీరుల కుటుంబాలు, తదితరలు పాల్గొన్నారు.