విశాలాంధ్ర – పరవాడ : ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్న 3 లారీలను మైనింగ్ అధికారులు సోమవారం సీజ్ చేశారు. పెదముషిడివాడలో విచ్చలవిడగా జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై విశాలాంధ్ర దిన పత్రికలో ‘ఆగని అక్రమ గ్రావెల్ తవ్వకాలు ` చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం’ శీర్షికతో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పంధించారు. ఈ మేరకు మైనింగ్ అధికారులు నిఘా పెట్టారు. సోమవారం రాత్రి పెదముషిడివాడ నుంచి తరలించి లంకెలపాలెం ప్రాంతంలో గ్రావెల్ అన్లోడ్ చేస్తుండగా అధికారులు 3 లారీలను పట్టుకున్నారు. అయితే ఈ సమాచారం అందుకున్న గ్రావెల్ దొంగలు మరికొన్ని లారీలను మద్యలో ఈ.మర్రిపాలెం జీడిమామిడి తోటల్లో దాచి పరారైనట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ గ్రావెల్ లారీల వద్ద ఎటువంటి బిల్లులు లేకపోవడంతో మైనింగ్ అధికారులు మూడు లారీలను సీజ్ చేసి పరవాడ పోలీసులకు అప్పగించారు. దీనిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని మైనింగ్ అధికారులు తెలిపారు.