విశాలాంధ్ర-రాప్తాడు : అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని, పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడం అభినందనీయమని ఎస్కేయూ వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి కొనియాడారు. సర్పంచ్ సాకే తిరుపాలు ఆధ్వర్యంలో ఎస్కేయూ ఎన్ఎస్ఎస్, ఫార్మసీ విభాగాలు శ్రీ శివసాయి హాస్పిటల్ యజమాన్యం రాప్తాడులో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ప్రతి గ్రామంలో ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే ఆలోచన శుభపరిణామమన్నారు. గ్రామాల్లో చాలా మందికి వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు. వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందచేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో బీపీ, షుగర్, హీమోగ్లోబిన్, ఆక్సిజన్ సామర్థ్య పరీక్షలను నిర్వహించారు. చికిత్సల కోసం వచ్చిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మురళీధరరావు, వైద్యులు డాక్టర్ సోమశేఖర్, ప్రొఫెసర్లు ఎన్ఆర్ సదాశివరావు, రామిరెడ్డి, కన్సల్టెంట్ వైద్యులు గౌరీశంకర్, హేమలత, చక్రధర్, ఎన్ఎస్ఎస్ పీఓ వెంకటరమణ, టీడీపీ నాయకులు గేట్ సత్తి, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.