వైద్య ఆరోగ్యశాఖలో వినియోగదారుల హక్కుల వారోత్సవాలు
విశాలాంధ్ర`అనంతపురం వైద్యం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల హక్కుల వారోత్సవాల కార్యక్రమం బుధవారం పట్టణ ఆరోగ్య కేంద్రం మంగళ వారి కాలనీలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డా.యుగంధర్ మాట్లాడుతూ…జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 63 వ్యాధి నిర్ధారక పరీక్షలు 130 రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నాయని నాణ్యమైన వ్యాధి నిరోధక టీకాలకు ప్రభుత్వ ఆసుపత్రి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా వినియోగదారుల హక్కుల ప్రెసిడెంట్ రవీంద్రా రెడ్డి మాట్లాడుతూ… వస్తువుల కొనుగోలు మరియు అమ్మకం, విలువలు మరియు సామర్థ్యం కలిగి ఉండాలన్నారు తద్వారా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి మరియు బలోపేతం కావడానికి దోదపడుతుందని పేర్కొన్నారు. వినియోగదారుల హక్కులు మరియు వారి సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని వినియోగ దారుల రక్షణ మరియు శ్రేయస్సుకై దృష్టి సారించాలని తెలియజేశారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ గురించి ప్రజలు అవగాహన చేసుకోవాలని అన్నారు. ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం వల్ల సైబర్ నేరాలు ఆహార కల్తీ విద్యా వైద్యం మొదలైన వాటి సేవలలో నియోగదారుడు మోసపోవడం జరగదని దీని ద్వారా సేవల నాణ్యత పెరుగుతుందని తెలియజేశారు. 2019 వినియోగదారుడు చట్టం లో ఎటువంటి వ్యక్తికైనా శిక్ష వుంటుందని అన్నారు. వినియోగదారుడు కొనుగోలు యొక్క రసీదు కలిగి వుంటే రెండు సంవత్సరాల లోపు ఎప్పుడైనా కేసు పెట్టే వీలు వుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల హక్కుల సభ్యులు నబి రసూల్, కృష్ణమూర్తి, మారుతి శర్మ ,శంకరప్ప, బాలన్న, గురు రాజ్, జిల్లా ప్రోగ్రాం అధికారి డా.నారాయణస్వామి,డెమో భారతి, డిప్యూటి డెమో త్యాగరాజు, లీగల్ అడ్వైసర్ ఆశా రాణి, వేణు గోపాల్ పాల్గొన్నారు.