జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత మూడు రోజుల నుంచి కురిసిన అకాల వర్షం వల్ల నష్టపోయిన అరటి పంట రైతులకు తక్షణమే రెండు లక్షల రూపాయలు, అదేవిధంగా వరి, మొక్కజొన్న రైతులకు 50 వేల రూపాయలు, మామిడి పంట రైతులకు తగిన మొత్తములో ప్రభుత్వము నష్టపరిహారం చెల్లిస్తూ వెంటనే ఆదుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వారి స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతి విపత్తు వలన నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం ఏకపాదం పల్లికి చెందిన ఆకుల శ్రీనివాసులు, చంద్రశేఖర్, రామాపురం గ్రామానికి చెందిన అల్లు చలపతి, గంతి సురేష్, కె. చలపతి, అల్లు రామాంజనేయులు, బత్తలపల్లి మండలంలోని అనంతసాగరం గ్రామానికి చెందిన సాకే ఈశ్వరయ్య, లింగారెడ్డిపల్లికి చెందిన ఓబుల నాయుడు, సింగనమల నియోజకవర్గం నార్పల మండలానికి చెందిన మాజీ డీలర్ ఎర్రి దిమ్మ, వెంకట నారాయణ రెడ్డి, వీరందరికీ అరటి తోటలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. తొలుత చిలక మధుసూదన్ రెడ్డి నష్టపోయిన అరటి తోటలను స్వయంగా వెళ్లి పరిశీలించారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఒక్కొక్క ఎకరానికి రెండు లక్షల రూపాయల చొప్పున, అలాగే వరి పంట మొక్కజొన్న పంట రైతులకు 50 వేల రూపాయల చొప్పున, మామిడి పంట రైతులకు తగిన మొత్తంలో ప్రభుత్వము వెనువెంటనే నష్టపరిహారం చెల్లించి, ఆదుకోవాలని తెలిపారు. లేనియెడల జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు.