: జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్
విశాలాంధ్ర -అనంతపురం : భారీ వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనం నుంచి వరదలు మరియు భారీ వర్షాల విపత్తు నిర్వహణపై వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్ లు, మండల అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి అందరూ ఉద్యోగులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా రెవెన్యూ శాఖ డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులందరినీ అప్రమత్తంగా ఉండేలా శిధిలావస్థలో ఉన్న భవనాలను, పాఠశాలలను గుర్తించి, ఆ ప్రదేశంలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఎత్తైన ప్రదేశాలను సురక్షితమైన ప్రదేశాలను ముందుగానే గుర్తించి వారిని గురించి విధంగా ముందు జాగ్రత్త ఏర్పాట్లను చేసుకోవాలని తెలిపారు. గ్రామ పరిధిలో ఉన్న వాగులు, వంకలు ప్రవాహతీవ్రతను ముందుగానే గుర్తించి ఎటువంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలుగా వీఆర్వో, వీఆర్ఏ ఇతర మండల పంచాయతీ శాఖల అధికారుల పరిధిలో దండోరా రూపంలో ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసే విధంగా చూడాలన్నారు. ప్రతిరోజు వర్షపాత నమోదును ఎప్పటికప్పుడు మండల జిల్లా స్థాయిలో తెలిసే విధంగా చూడాలని సంబంధిత శాఖను ఆదేశించారు. భారీ వర్షం కారణంగా పశువులు, గొర్రెలు, మేకలను వాగులు వంకలు దాటే సమయంలో పైనుండి వరద నీరుని ప్రవహించే ప్రదేశాలలో వెళ్లకుండా పశువుల కాపర్లు చూసే విధంగా వారికి అవగాహన కల్పించేలా గ్రామస్థాయి వ్యవసాయ అధికారులు పనిచేయాలన్నారు. కోతకు వచ్చిన పంటలను వాయిదా వేసుకునేలా, పండించిన ధాన్యాన్ని భద్రపరిచే విధంగా రైతులకు మండల, జిల్లాస్థాయిలో ఉన్నటువంటి అధికారులు అవగాహన కల్పించి ఎలాంటి పంట నష్టం జరగకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను సూచించారు. కుంటలు, చెరువులు 80 శాతం నిండిన చెరువులను గుర్తించి ఇరిగేషన్ శాఖ వారు పర్యవేక్షణ గుర్తించి జిల్లా స్థాయి అధికారులకు సమాచారాన్ని చేరవేయాలని, అలాగే ఆ చెరువులకు గండి ప్రదేశాలను గుర్తించి, ఇసుక బస్తాలను ముందు జాగ్రత్తగా చర్యల ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. అన్ని రిజర్వాయర్ లలో నీటి నిల్వలపై నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. ఆరోగ్యశాఖ వారిని జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండేలా చూడాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వాటిని అరికట్టుటకు తగు జాగ్రత్తలు తీసుకొని మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో, పంచాయితీ శాఖ ఇతర శాఖల వారితో సమన్వయం చేసుకొని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ, వారికి కావలసిన మందులు ఉండేలా చూడాలన్నారు. పాఠశాలలలో, పాత భవనాలను గుర్తించి పిల్లలకు సురక్షితంగా ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో విద్యుత్ సరఫరా సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే దాని పరిష్కరించే విధంగా చూడాలన్నారు. మండల, గ్రామ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను, వాగులు, వంకలు సమస్యాత్మకమైన ప్రదేశాలను గుర్తించే విధంగా మండల గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నివేదికలను సంబంధిత పై అధికారులకు చేయాలన్నారు. మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా కావలసిన ఏర్పాట్లను, కావలసిన పరికరాలను, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని పోలీసు, అగ్నిమాపక అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, సెబ్ అడిషినల్ ఎస్పీ రామకృష్ణ, ఆర్డీఎంఏ పివిఎస్ఎన్.మూర్తి, డిపిఓ ప్రభాకర్ రావు, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, డిటిసి వీర్రాజు, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, కలెక్టరేట్ ఏవో అంజన్ బాబు, పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రహ్మణ్యం, హార్టికల్చర్ డిడి ఫిరోజ్ ఖాన్, జెడ్పి డిప్యూటీ సిఈఓ లలితా బాయి, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, డిపిఎం ఆనంద్, పబ్లిక్ హెల్త్ ఈఈ సతీష్ చంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.