నగరాభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి
తన వంతు సహకారం ఉంటుందన్న మంత్రి సవిత
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నివాసంలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితమ్మ సందడి చేశారు. ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు బుధవారం ఉదయం ఆమె వచ్చారు. ముందుగా ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు మంత్రి సవితమ్మకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత నాయకులందర్నీ ఆప్యాయంగా పలుకరిస్తూ మంత్రి సందడిగా గడిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మినారాయణ, జనసేన మహిళా విభాగం రాయలసీమ అధ్యక్షురాలు పెండ్యాల శ్రీలత కూడా పాల్గొన్నారు. అల్పహార విందు అనంతరం నియోజకవర్గంలోని పలు అంశాల గురించి చర్చించారు. అర్బన్ నియోజకవర్గ పరిధిలో బీసీలు, అలాగే చేనేతలు ఉన్నారని.. వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని అంశాలు వచ్చేలా చూడాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. దీనికి మంత్రి సవిత సానకూలంగా స్పందించారు. తనవంతు సహకారం కచ్చితంగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.