విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.విరబ్బాయి ఆధ్వర్యంలో సిగరెట్టు, ఇతర పొగాకు సంబంధింత ఉత్పత్తుల యొక్క వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై బుధవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఈ ర్యాలీని నగర మేయర్ మహమ్మద్ వాషింగ్ సలీం, అసిస్టెంట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కుశాల్ జైన్ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ… మనకు సరైన ఆహారం కావాలి కానీ పొగాకు కాదు కావున ప్రజలందరూ మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని పొగాకు మరియు వాటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలని తెలియజేశారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరి చేత పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ… పొగాకు వినియోగం వల్ల పర్యావరణ కాలుష్యం అవుతోందని మరియు మనిషి యొక్క ఆయుష్ క్షీణిస్తోందని కావున పొగాకు ఏ రూపంలో వాడినా అది మానవాళి ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుందన్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు ప్రైవేట్ విద్యాసంస్థల పరిధిలో ఉన్న దుకాణాలలో సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదని తెలియజేశారు అతిక్రమించిన వారిపై చట్టం ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది అన్నారు. పొగాకు నియంత్రణ కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ నారాయణస్వామి మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా ధూమపానం వలన ఎనిమిది లక్షల మంది మిలియన్ ప్రతి సంవత్సరం 8 మిలియన్ల మంది చనిపోతున్నారని అందులో ఒక్క మిలియన్ ప్రజలు స్మోకింగ్ వల్ల చనిపోతున్నారని తెలియజేశారు. సిగరెట్ వాడడం వలన అందులో ఉన్న నాలుగు వేల రకాల రసాయనాలు మనిషి యొక్క అవయవాలపై ప్రభావం చూపించి క్యాన్సర్ కు ముఖ్యంగా నోటికి మరియు గొంతు క్యాన్సర్ కు కారణం అవుతున్నాయి అన్నారు. బహిరంగ ధూమపానము చేసిన మరియు ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోని 100 గజాల లోపు ఎవరైనా దుకాణాలలో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానా రూ:200 కూడా విధించడం జరుగుతుందన్నారు. పొగాకు ఉత్పత్తులపై ఎటువంటి ప్రచారం నిర్వహించ రాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీ భాస్కర్ రెడ్డి ,మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఏ శ్రీదేవి , నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లలిత కుమారి ,అనురాధ, డి ఐ ఓ యుగంధర్, డాక్టర్ సుజాత, డాక్టర్ గంగాధర్, డెమో భారతి, త్యాగరాజు, జిల్లా పొగాకు నియంత్రణ సోషల్ వర్కర్ శ్రీరాములు, ఎన్సీడీ సిబ్బంది, రమేష్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటర్, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.