-ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర-రాప్తాడు : మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల రవీంద్ర ఆశయాలను నెరవేరుస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. రామగిరి మండలం వెంకటాపురంలోని పరిటాల ఘాట్ వద్ద ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ తమ కుటుంబ సభ్యులతో కలసి పరిటాల ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం వందలాదిగా తరలివచ్చిన అభిమానులు, వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించగా వెంకటాపురంలో సందడి వాతావరణం కనిపించింది.
పరిటాల రవీంద్ర సోదరి ఉష ఘాట్ వద్ద మిఠాయిల పంపిణీ, అన్నదానం చేప్టటారు. పరిటాల రవీంద్ర మెమొరియల్ ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గంగంపల్లి రెసిడెన్సియల్ స్కూల్ సెంటర్ వద్ద గరుత్మంతుని విగ్రహం ప్రారంభించారు. ఎంజేపీ రెసిడెన్సియల్ స్కూల్ విద్యార్థులకు 600 స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. మాజీ జడ్పీటీసీ రామమూర్తినాయుడు రూ.50వేల వ్యయంతో త్రాగునీటి ఫ్రిజ్ అందజేశారు. మాజీ ఎంపిపి రంగయ్య సొంత నిధులతో స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా పరిటాల సునీత, శ్రీరామ్ మాట్లాడుతూ రవి చనిపోయి ఇన్నేళ్లు అయినా ప్రజలు మాత్రం ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ప్రతి జయంతి, వర్ధంతికి పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారన్నారు. అలాగే రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమన్నారు. రవి చేపట్టిన సేవా కార్యక్రమాలు భవిష్యత్ లో కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు.