‘జగనన్న విదేశీ విద్యా దీవెన’పై ఉత్తర్వులు జారీ
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: విదేశీ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించేందుకు పోటీపడుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు జగన్ సర్కార్ తీపి కబురందించింది. జగనన్న విదేశీ విద్య కోసం కొత్త పథకం తెచ్చింది. ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పేరుతో అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేస్తూ... లబ్ధిదారులకు ఒనగూరే ప్రయోజనాలను వివరించింది. ఈ పథకంలో భాగంగా క్యూఎస్ ర్యాంకింగ్స్లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థుల చదువుకయ్యే ఖర్చును భరించాలని నిర్ణయించింది. అయితే మొదటి 100 ర్యాంకింగ్స్లో ఉన్న యూనివర్సిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని, 100పైబడి 200 ర్యాంకింగ్స్లో ఉన్న యూనివర్సిటీల్లో సీటు సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపు చేయనుంది. మొత్తం నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్మెంట్ చేయనున్నారు. ల్యాండిరగ్ పర్మిట్ లేదా ఐ-94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లిస్తారు. ఫస్ట్ సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు రాగానే రెండో వాయిదా, రెండో సెమిస్టర్ ఫలితాలు రాగానే మూడో వాయిదా, నాలుగో సెమిస్టర్ లేదా ఫైనల్ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపులు చేస్తారు. పీహెచ్డీ, ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏడాది వారీగా లేదా సెమిస్టర్ వారీగా కోర్సు పూర్తయ్యేంతవరకూ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తారు. ఎటువంటి పరిమితులు లేకుండా ఏడాదికి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుంది. 35 ఏళ్లలోపు ఉన్న వయసు, ఏపీ స్థానికుడైన వారికి కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందే వీలుంది. ఏటా సెప్టెంబరు, డిసెంబరు, జనవరి, మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నోటిఫికేషన్ జారీ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నేతృత్వంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ప్రపంచంలోని ఏ దేశమైనా అత్యుత్తమ యూనివర్సిటీల్లో టాప్
200కు ఈ పథకం వర్తించనుంది.