తాను వైసీపీని ఒక్క మాట కూడా అనలేదని, తాను ఏ తప్పు చేయకుండానే తనపై పార్టీ వేటు వేయడం ఎంతవరకు సమంజసమని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రశ్నించారు. తన సస్పెన్షన్కు కారణమేమిటో చెప్పాలని, లేనిపక్షంలో తాను చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎందుకు సస్పెన్షన్ వేటు వేయడం లేదని కూడా ఆయన ప్రశ్నించారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం దారుణమన్నారు. గురువారం సాయంత్రంలోగా తన సస్పెన్షన్కు గల కారణాలను మీడియాకు విడుదల చేయాలని ఆయన వైసీపీని డిమాండ్ చేశారు. సరైన కారణం లేకుండా సస్పెండ్ చేస్తే చట్టపరంగా పోరాటం చేస్తానని అన్నారు.