తుంగభద్ర నుంచి నీటి విడుదలతో అధికారుల అప్రమత్తం
విశాలాంధ్ర బ్యూరో`కర్నూలు : కృష్ణా పరివాహక ప్రాంతంలో వరదలు రావడంతో శ్రీశైలం జలాశయానికి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దీంతో శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తుంది. ఎగువ కర్నాటక ప్రాంతంలో వరదలు రావడంతో తుంగభద్ర ప్రాజెక్టు నుండి దిగువకు నీటిని విడుదల చేశారు. మంత్రాలయంలో ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. రాఘవేంద్రస్వామి మఠంఘాట్లను తాకి ప్రహహం ఉధృతం కావడంతో భక్తులు, ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తుంగభద్ర నుండి సుంకేసులకు… అక్కడి నుంచి శ్రీశైలం జలాశయానికి నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ జూరాల నుండి 53,216 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 84,840 క్యూసెక్కులు మొత్తం 1,36,056 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా శ్రీశైలం జలాశయం నుండి పోతిరెడ్డిపాడుకు 8 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 1,688 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకర్తి లిప్టు ఇరిగేషన్ నుండి 800 క్యూసెక్కులు, ఏపీ జలవిద్యుత్కు 30,018 క్యూసెక్కులు, తెలంగాణ జలవిద్యుత్కు 35,215 క్యూసెక్కులు మొత్తం కలిపి 1,41,141 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.40 అడుగులకు చేరుకుంది. పూర్తి నీటి సామర్ధ్యం 215.8070 టీఎంసీలుకాగా ప్రస్తుతం 203.1165 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరదఉధృతి మరింత పెరిగితే స్పిల్వే గేట్ల ద్వారా మరోసారి దిగువ సాగర్కు నీరు విడుదల చేయవలసి వస్తుంది. తుంగభద్ర నుండి పెద్దఎత్తున నీరు వస్తుండటంతో జిల్లా అధికారులు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కర్నూలు నగరంలోని తుంగభద్ర నది ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.