గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాన్నాయి. సభ మొదటి రోజే 3 రాజధానుల అంశంపై లఘు చర్చ జరిగే అవకాశం ఉంది. 3 రాజధానుల అంశంపై సీఎం జగన్ పవర్పాయింట్ ప్రజంటేషన్ చేస్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యాన్ని.. ప్రజల్లోకి సమగ్రంగా తీసుకెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి జరిగే సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ ప్రారంభించడంతోపాటు టీడీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైసీపీ నిర్ణయించింది. మూడు రాజధానుల బిల్లు చర్చ వంటి అంశాలను సీఎం జగన్ నిర్ణయానికి వదిలివేశారు. బీఏసీ సమావేశంలో తెలుగుదేశం ప్రతిపాదించే అంశాలపై చర్చ చేపట్టి.. ఆ పార్టీని డిఫెన్స్లో పడేయాలని వ్యూహా కమిటీ సమావేశంలో పలువురు నేతలు సూచించారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు అధికార వైసీపీ సన్నద్ధమైంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడం, టీడీపీని డిఫెన్స్లో పడేసే విధంగా చర్చ చేపట్టాలని అధికారపార్టీ నిర్ణయించింది. సమావేశాలు ఐదు రోజులపాటు నిర్వహించాలని తాత్కాలికంగా నిర్ణయించారు. బిఏసీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.