ఓ ఆర్టీసీ డ్రైవర్ తీరు వివాదాస్పదమైంది. బస్సును ఇష్టానుసారం డ్రైవ్ చేస్తుండడంతో ప్రయాణికులు మందలించారన్న కోపంతో, అర్ధరాత్రి వేళ వారిని బస్సులోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. కడప జిల్లాలో జరిగిందీ ఘటన. కడప డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సోమవారం రాత్రి 11 గంటలకు 35 మంది ప్రయాణికులతో కడప నుంచి బెంగళూరు బయలుదేరింది. బస్సును ర్యాష్గా డ్రైవ్ చేస్తుండడంతో భయపడిన ప్రయాణికులు అతడిని మందలించారు. దీంతో అన్నమయ్య జిల్లా గుర్రంకొండ సమీపంలో బస్సును రోడ్డుపైనే వదిలేసిన డ్రైవర్ వెళ్లిపోయాడు ఎంత సేపటికీ రాకపోవడంతో ప్రయాణికులు ఆర్టీసీ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆర్టీసీ అధికారులు వెంటనే మరో డ్రైవర్ను పంపడంతో ప్రయాణికులు గమ్యస్థానం చేరుకున్నారు. డ్రైవర్ బస్సును మార్గమధ్యంలో వదిలేసి వెళ్లిపోవడం నిజమేనని, అతడు ఎందుకలా వెళ్లిందీ తెలుసుకుంటామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.