జి.కొత్తపల్లిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో శనివారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జి. కొత్తపల్లిలో ఇవాళ వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను పార్టీలోని మరో వర్గం అడ్డుకుని దాడికి దిగింది. ఎమ్మెల్యేను వెంబడిరచి ఓ ప్రాంతంలో వైసీపీ వర్గీయులు చుట్టుముట్టి దాడిచేశారు. దీంతో పోలీసులు బారి వారి బారినుంచి ఎమ్మెల్యేను తప్పించి ఆయనను అక్కడికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాల భవనంలో ఉంచారు. అయితే ఆ పాఠశాల భవనాన్ని కూడా రౌండప్ చేసి ఎమ్మెల్యేను వదిలిపెట్టేది లేదంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.పాఠశాల భవనం లోపల ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఆ భవనం చుట్టూ వైసీపీ శ్రేణులు… వారి మధ్య పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలో గడచిన మూడు గంటలుగా గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ అదనపు బలగాలను తీసుకుని గ్రామానికి బయలుదేరారు.జి.కొత్తపల్లిలో ఇరువర్గాల మధ్య ఆధిపత్యంలో గంజిప్రసాద్ హత్య జరిగినట్లు సమాచారం. మరో వర్గానికి మద్దతు వల్లే హత్య జరిగిందంటూ ఎమ్మెల్యేపై దాడికి దిగినట్లు తెలుస్తోంది.