నేడు వాయుగుండంగా మారే అవకాశం
విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం : తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిరదని, ఇది మంగళవారం వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కె.వి.ఎస్.శ్రీనివాస్ తెలిపారు. ఇది పశ్చిమ బంగాల్, ఒడిశా తీరం వైపు కదులుతోందన్నారు. ఈ అల్పపీడనం ఈ నెల 24న వాయువ్య బంగాళాఖాతంలో తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తా మీదుగా అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. తుపాను ఏర్పడిన తర్వాత ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర ప్రాంతంలో ప్రభావం చూపుతుందన్నారు. ఒడిశా వైపు సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు వెనక్కి రావాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. మరొక ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్షలు నిర్వహిం చారు. మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలో వాయుగుండం ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉంటుందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో అధికారులు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు.
బెంగాల్, ఒడిశాకు 25 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుపాను గురువారం పూరీ-సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నందున జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) పశ్చిమ బెంగాల్లో 14 బృందాలను, ఒడిశాలో 11 బృందాలను మోహరింపు కోసం సిద్ధంగా ఉంచినట్లు ప్రభుత్వ ప్రకటన సోమవారం తెలిపింది. తుపాను కోసం సంసిద్ధతను సమీక్షించడానికి సోమవారం జరిగిన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్సీఎంసీ) సమావేశంలో క్యాబినెట్ కార్యదర్శి సోమనాథన్కు కూడా ఓడలు, విమానాలతో పాటు సైన్యం, నావికాదళం, కోస్ట్ గార్డ్ల అదనపు సహాయ, ఉపశమన బృందాలను సంసిద్ధతలో ఉంచినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాణనష్టం లేకుండా చూడటానికి, ఆస్తి, మౌలిక సదుపాయాల నష్టాన్ని తగ్గించడానికి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చని సోమనాథన్ నొక్కి చెప్పారు. సముద్రంలో ఉన్న మత్స్యకారులను వెనక్కి పిలిపించేలా చూడాలని, ప్రమాదకర ప్రాంతాల ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ జార్ఖండ్, చత్తీస్గఢ్కు భారీ వర్షాల కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సోమనాథన్ సూచించారు.