విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ప్రైవేట్, అన్
ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకుగాను 25 శాతం విద్యార్థులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. దీనిపై హైకోర్టులో మంగళవారం వాదోపవాదాలు కొనసాగాయి. చివరికి జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 24ను కొట్టివేస్తూ న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చింది. అమ్మఒడి ఇస్తుండటంతో ఒకటో తరగతిలో 25 శాతం వరకు పిల్లలను చేర్చుకోవాలని 2023-24 విద్యాసంవత్సరంలో జీవో 24ను గత ప్రభుత్వం జారీ చేసింది. దీనిని అప్పట్లోనే విద్యాసంస్థల నిర్వాహకులు హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టులో విచారణ జరుగుతుండగానే 2023-24లో ఒకటో తరగతిలో 25 శాతం మంది పిల్లలను ప్రభుత్వం సూచించిన వారికి ప్రవేశాలు కల్పించాలంటూ ఆ జీవో ద్వారా ఉత్తర్వులిచ్చింది. అప్పట్లో ఆయా ప్రవేశాలు అన్నీ తుది తీర్పుకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యాహక్కు చట్టానికి పూర్తి భిన్నంగా ఉందని, అన్ని చట్టాలను ఉల్లంఘించేలా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వం అనాలోచిత చర్యలతో 15 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వారిని కొనసాగించాలా…లేదా అనే అంశంపై గందరగోళం ఏర్పడిరది. రెండు విద్యా సంవత్సరాలపాటు చదువు చెప్పినందుకుగాను తమకు ఫీజు ఎవరిస్తారని విద్యాసంస్థల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.