రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహోద్యమ బహిరంగ సభలో పాల్గొనేందుకు తిరుపతికి వచ్చిన చంద్రబాబు మొదటగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు.అభివృద్ధి వికేంద్రికరణతో ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మూడు రాజధానులతో అభివృద్ధి జరగదని, ఇలాంటి మాయమాటలతో రాష్ట్రం నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని 5 కోట్ల ప్రజల సమస్య అని, ఏపీ ప్రజల భావితరాల భవిష్యత్ కోసం ఒకే రాజధాని ఉండాలన్నారు. ఏపీని అన్ని విధాలా రక్షించాలని శ్రీవారిని ప్రార్థించానని చంద్రబాబు తెలిపారు.