ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం.. కోస్తాలోని పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం.. ఇటు రాయలసీమలోని కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు తీరం వెంబడి గంటకు ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం వెంకటగిరిలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్లు, సీతానగరం 8.8, బొబ్బిలి 8.3, సాలూరు 7.3, కొయ్యూరు 6.6, లింగసముద్రం 6.1, అమలాపురం 5.8, చోడవరం 5.2, గోకవరం 5.0 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు, మూడు రోజులు విస్తారంగా వర్షాలు పడతాయంటున్నారు.